Saturday, June 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసంపద సృష్టించే శ్రమజీవులకే బువ్వలేదు

సంపద సృష్టించే శ్రమజీవులకే బువ్వలేదు

- Advertisement -

– ప్రతి పేద కుటుంబానికీ రెండెకరాల భూమి పంచాలి
– భూభారతిలో అసైన్డ్‌ భూముల్ని చేర్చాలి ఉపాధి హామీలో 7 కోట్ల మంది పేదల తొలగింపు
– పేదలకు ఇండ్లు, స్థలాలివ్వాలి.. అసైన్డ్‌ భూములు పంచాలి : సంగారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట వ్యకాస ధర్నాలో జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి

”దేశంలో 45 శాతానికి పైగా కుటుంబాలకు సెంటు భూమి లేదు. సంపద సృష్టించేది, ఆహార ధాన్యాలు పండించేది శ్రమ జీవులు. కానీ.. వాళ్లందరికీ తినేందుకు బువ్వలేదు. అందుకే ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌ 105వ స్థానంలో ఉంది. తెలంగాణలో పేదలకు నిలువ నీడలేదు. రైతు, కూలీలకు శ్రమకు తగ్గ ఫలితం రావడం లేదు. అయినా సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడాలని, అందుకే అందాల పోటీలు పెట్టామని చెప్పారు. మరోపక్క తానే విశ్వగురువునంటూ ప్రపంచాన్ని ఊరేగుతూ ప్రధాని మోడీ తనకు తానే కితాబిచ్చుకుంటారు.. ఇద్దరు నేతలు చెప్పే మాటలకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేదు’ అని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ అన్నారు. పేదల ఇండ్లు, ఇండ్ల స్థలాలు, అసైన్డ్‌ భూముల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. స్థానిక పీఎస్‌ఆర్‌ గార్డెన్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ధర్నాలో బి.వెంకట్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో 50 శాతం కుటుంబాలకు సెంటు భూమి కూడా లేదని, పేదల ఆదాయాలు తగ్గిపోవడం వల్ల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో 1.5 కోటిన్నర ఎకరాలు, దేశంలో 40 కోట్ల ఎకరాల సాగు భూములున్నాయని, వాటిల్లో సగ భాగం 5 శాతంగా ఉన్న ధనవంతుల చేతుల్లోనే ఉన్నాయన్నారు. ప్రతి పేద కుటుంబానికీ 2 ఎకరాల చొప్పున సాగు భూముల్ని పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. పేదలకు పంపిణీ చేసిన 22 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూముల రికార్డులు బయటపడకుండా దాచేందుకే భూ భారతిలో ఆ భూముల సమస్యల్ని పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో అత్యధిక మంది సమస్యగా ఉన్న అసైన్డ్‌ భూముల్ని భూ భారతిలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రధాని మోడీకి కుటుంబమంటూ లేదని, అదానీ, అంబానీలాంటి కార్పొరేట్లే ఆయనకున్న ఏకైక కుటుంబమని ఎద్దేవా చేశారు. కార్పొరేట్ల ప్రయోజనాలు తప్ప దేశ ప్రజల కష్టసుఖాలు పట్టడం లేదని విమర్శించారు.
ప్రజలు ఐక్యంగా ఉంటే ప్రశ్నిస్తారనే భావనతో కులం, మతం పేరిట విద్వేషాల్ని రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందుతున్నారని విమర్శించారు. సంగారెడ్డి జిల్లాలో సెజ్‌లు, ఫార్మా కంపెనీల పేరిట రైతుల భూముల్ని లాక్కొని కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టే కుట్రల్ని సీపీఐ(ఎం) మాత్రమే ఎదుర్కొని నిర్వాసిత రైతుల పక్షాన నిలుస్తున్నదన్నారు. జులై 9న జరిగే సమ్మె పోరాటంలో పేదలంతా ఐక్యగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
భూ భారతిలో పేదలకు న్యాయం జరగట్లేదు
ఆర్‌. వెంకట్రాములు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

భూ భారతి వల్ల పేదల భూ సమస్యలేమీ పరిష్కారం కావడం లేదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు అన్నారు. నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని పారదర్శకంగా అమలు చేయడం ద్వారా 200 పని దినాలు, రూ.600 వేతనం పెంచాలన్నారు. ప్రధాన మంత్రి ఆవాజ్‌యోజన పథకం ద్వారా పేదలకు ఇండ్లు కట్టిస్తున్నామని చెప్పుకునే ప్రధాని మోడీ తెలంగాణకు ఒక్క ఇల్లు కూడా ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. నాగిరెడ్డిపల్లిలో 70 ఎకరాల పేదల భూముల్ని కొందరు కబ్జా చేసి కాజేస్తుంటే అధికారులు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఆ భూములు పేదలవేనని హైకోర్టు తీర్పు ఇచ్చినా జిల్లా కలెక్టర్‌ చర్యలు తీసుకోవడం లేదన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు మాట్లాడారు. అనంతరం కలెక్టరేట్‌ ఏఓకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.నర్సింహులు, జిల్లా అధ్యక్షులు బి.రామచందర్‌, జిల్లా నాయకులు ఏసోబు, సుజాత, షబానా, కుమార్‌ రాజు, ప్రభాకర్‌, మొగులయ్య, అర్జున్‌, కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి మానిక్‌, అశోక్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -