Saturday, June 21, 2025
E-PAPER
Homeజాతీయం2024 సార్వత్రిక ఎన్నికల ఖర్చులో 45 శాతం బీజేపీదే

2024 సార్వత్రిక ఎన్నికల ఖర్చులో 45 శాతం బీజేపీదే

- Advertisement -

ఏడీఆర్‌ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ :
2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక నిధులను బీజేపీ ఖర్చు చేసింది. దేశంలోని అన్ని పార్టీలు చేసిన మొత్తం ఖర్చులో 45 శాతం నిధులను ఆ పార్టీ వ్యయం చేసినట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) తెలిపింది. ఈ ఎన్నికల కోసం బిజెపి సుమారు రూ.1,494 కోట్లు ఖర్చు చేసిందని, మొత్తం ఎన్నికల వ్యయంలో ఇది 44.56 శాతమని వివరించింది. కాంగ్రెస్‌ రెండో స్థానంలో నిలిచిందని, ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ రూ.620 కోట్లు ఖర్చు చేయగా, మొత్తం వ్యయంలో 18.5 శాతమని తెలిపింది. 32 జాతీయ, ప్రాంతీయ పార్టీల రికార్డులను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించినట్టు వివరించింది. 2024 మార్చి 16 నుంచి జూన్‌ 6 వరకు నిర్వహించిన లోక్‌సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కింలలో అసెంబ్లీ ఎన్నికల కోసం వివిధ పార్టీలు మొత్తంగా రూ.3,352.81కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపింది. ఈ ఖర్చులో జాతీయ పార్టీల వాటా రూ.2,204 కోట్లు (65.75శాతం). మొత్తం నిధులలో.. జాతీయ పార్టీలు రూ.6,930.246 కోట్లు (93.08శాతం) సేకరించగా, ప్రాంతీయ పార్టీలు రూ.515.32 కోట్లు (6.92శాతం) సేకరించాయని నివేదిక పేర్కొంది.
సార్వత్రిక ఎన్నికలు జరిగిన 90 రోజుల లోపు, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 75 రోజులలోపు రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్‌ (ఈసీ)కి వ్యయ నివేదికలను దాఖలు చేయాల్సి వుంటుంది. ఈ నివేదికలను విశ్లేషించి నివేదికను రూపొందించినట్టు ఏడీఆర్‌ తెలిపింది. నివేదిక సమర్పణలో తీవ్రమైన జాప్యం జరిగినట్టు ఏడీఆర్‌ గుర్తించింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) 168 రోజుల ఆలస్యంగా, బీజేపీ 139 రోజుల ఆలస్యంగా నివేదికలను దాఖలు చేసినట్టు తెలిపింది.
ప్రచారానికే అధిక ఖర్చు
పార్టీలు ప్రకటించిన మొత్తం వ్యయంలో రూ.2,008 కోట్లు లేదా 53 శాతం కంటే ఎక్కువ మొత్తం ప్రచారానికే ఖర్చు చేసినట్టు నివేదిక తెలిపింది. తరువాతి స్థానంలో ప్రయాణ ఖర్చులు రూ.795 కోట్లు, అభ్యర్థులకు ఏకమొత్తం అందించినవి రూ.402 కోట్లు, పార్టీలు వర్చువల్‌ ప్రచారాల కోసం రూ.132 కోట్లకు పైగా ఖర్చు చేశాయి. అభ్యర్థుల నేరచరిత్రలను ప్రచురించడం కోసం రూ.28 కోట్లు వెచ్చించాయి. 32 రాజకీయ పార్టీలు ప్రచారం కోసం చేసిన మొత్తం ఖర్చులో, జాతీయ పార్టీలు రూ.1,511 కోట్లు లేదా 75.25శాతం ఖర్చు చేయగా, ప్రాంతీయ పార్టీలు రూ.496.99 కోట్లు లేదా 24.75శాతం ఖర్చు చేశాయి.
స్టార్‌ క్యాంపెయినర్లకు భారీగా ప్రయాణ ఖర్చులు
ప్రయాణ ఖర్చులుగా రూ.795 కోట్లు చూపగా, అందులో రూ.765 కోట్లు (96.22 శాతం) స్టార్‌ క్యాంపెయినర్ల కోసమే ఖర్చు చేశారు. ఇతర నాయకుల కోసం రూ.30 కోట్లు మాత్రమే ఖర్చయింది. నివేదికను తయారు చేసినప్పుడు ఎన్‌సీపీ, జేఎంఎం, శివసేన (యూబీటీ)సహా 21 పార్టీల వివరాలు ఈసీ వెబ్‌సైట్‌లో అందుబాట్లో లేవని ఏడీఆర్‌ పేర్కొంది. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 690 గుర్తింపు లేని పార్టీలు పోటీ చేశాయని తెలిపింది. అవకాశమున్న ప్రతి చోటా ఖర్చును చెక్కులు లేదా డీడీలు లేదా ఆర్‌టీజీఎస్‌ ద్వారా లావాదేవీలకు పరిమితం చేయాలని ఎన్నికల కమిషన్‌ను ఏడీఆర్‌ కోరింది. అభ్యర్థుల ఖర్చును పర్యవేక్షించినట్లుగానే, పార్టీల ఖర్చులను కూడా పర్యవేక్షించేందుకు పరిశీలకులను నియమించాలని విజ్ఞప్తి చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -