– బెంగళూరు క్రైమ్బ్రాంచ్ అదుపులోకి..
బెంగళూరు : బెంగళూరు రేవ్పార్టీ కేసులో సినీ నటి హేమ అరెస్టయ్యారు. ఈ కేసులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు ఆమెకు రెండుసార్లు నోటీసులి వ్వగా విచారణకు హాజరుకాలేదు. తాజాగా మూడోసారి పోలీసులు నోటీసులు పంపడంతో ఆమె సోమవారం విచారణకు హాజరయ్యారు. అనంతరం ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం కోర్టులో హాజరుపరచనున్నారు. కాగా, బెంగళూరు నగర శివారులోని హెబ్బగోడిలో గత నెల మే 20వ తేదీన జరిగిన రేవ్పార్టీలో పలువురు తెలుగు నటీనటులు, మోడళ్లు పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే ఈ రేవ్ పార్టీకి, తనకు ఎలాంటి సంబంధం లేదని హేమ మొదట బుకాయించారు. ఆ తర్వాత తనకు జరిపిన రక్త పరీక్షల్లో ఆమె డ్రగ్స్ తీసుకున్నారని రుజువైంది. దీంతో ఈ కేసు విచారణకు హాజరుకావాలని సీసీబీ పోలీసులు రెండుసార్లు హేమకు నోటీసులిచ్చారు. కానీ ఆమె తనకు వైరల్ ఫీవర్ వచ్చిందని, విచారణకు హాజరు కాలేనని బెంగళూరు పోలీసులకు లేఖ రాశారు. ఆమె అభ్యర్థనను పోలీసులు పరిగణనలోకి తీసుకోకుండా మూడోసారి కూడా నోటీసులిచ్చారు. ఈ పార్టీకి ప్రధాన కారకులైన రణధీర్, మహ్మద్ సిద్ధిఖీ, వాసు, అరుణ్కుమార్, నాగబాబును పోలీసులు ఇదివరకే అరెస్టు చేశారు.