Sunday, June 22, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఅబద్ధాల ముఖ్యమంత్రి

అబద్ధాల ముఖ్యమంత్రి

- Advertisement -

పటాన్‌చెరు నియోజకవర్గ రైతులకు రైతు భరోసా ఇవ్వాలి : సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
జిన్నారంలో మహాధర్నా
నవతెలంగాణ-జిన్నారం

అబద్ధాల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అని, ఆయన ఎనుముల రేవంత్‌రెడ్డి కాదు.. కోతల రేవంత్‌ రెడ్డి అంటూ సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ రైతులకు రైతు భరోసా ఇవ్వాలంటూ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి ఆదర్శ్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం జిన్నారం మండల కేంద్రంలో మహాధర్నా నిర్వహించారు. ధర్నాలో హరీశ్‌రావ్‌తోపాటు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్‌, వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, మాణిక్‌రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ..పటాన్‌చెరు నియోజ కవర్గ పరిధిలోని నాలుగు మండలాల రైతులకు వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల రైతాంగానికి రైతు భరోసా కోత ఎదురవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 22 వేల మంది ఔటర్‌ రింగ్‌ రోడ్‌ రైతాంగానికి భరోసాగా భారీ స్థాయిలో వంటావార్పు కార్యక్రమాలతో పోరాటం
చేస్తామన్నారు. రైతు భరోసా అందకుంటే త్వరలో కలెక్టరేట్‌ను ముట్టడిద్దామంటూ రైతాంగానికి పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరు అరచేతిలో వైకుంఠం చందంగా మారిందన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను నిండా ముంచిందన్నారు. లక్ష మందికి పింఛన్లు కోత పెట్టిందన్నారు. రైతుబంధు నేడు నాట్లకు కాదు ఓట్లకు అన్న చందంగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో కేడీల, బేడీల రాజ్యంగా మారిందని ఎద్దేవా చేశారు. హైడ్రా పేరుతో రాష్ట్రంలో జరిగిన మంచి పని ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. నేను పొడవు ఉన్నా, నాకు జ్వరం వచ్చినా సీఎంకు ఏడుపేనని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి అరెస్టు దుర్మార్గమైందని, నాన్‌ బెయిలబుల్‌ కేసులు హేయనీయమని హరీశ్‌రావు అన్నారు. ఈ మహాధర్నాలో డీసీఎంఎస్‌ చైర్మెన్‌ మల్కాపురం శివకుమార్‌, మఠం బిక్షపతి, నాయకులు కొలను బాల్‌రెడ్డి, చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి, జిన్నారం వెంకటేశంగౌడ్‌, రాజేష్‌గౌడ్‌, కార్పొరేటర్‌ మెట్టు కుమార్‌యాదవ్‌, తెల్లాపూర్‌ మాజీ సర్పంచ్‌ సోమిరెడ్డి, మాజీ కార్పొరేటర్‌ తొంట అంజయ్య, తెల్లాపూర్‌ మాజీ వైస్‌ చైర్మెన్‌ రాములు గౌడ్‌, సీనియర్‌ నాయకులు గోవర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతు భరోసా నిధులు జమ చేయాలి
పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం, జిన్నారం, పటాన్‌చెరు, అమీన్పూర్‌ మండలాల్లో సుమారు 42,302 ఎకరాల భూమికి సంబంధించి 27,120 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయాలని కోరుతూ స్థానిక రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేశారు. రైతు భరోసా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోయారు.
రప్పా.. రప్పా..3.0.. ప్లకార్డులు
ఎమ్మెల్యే హరీశ్‌రావు పాల్గొన్న ఈ మహాధర్నాలో ”రప్పా.. రప్పా..” అనే నినాదంతో ప్లకార్డులు వెలిశాయి.. ఈ పదంతో ఏపీలో దుమారం రేగుతుండగా.. అది తెలంగాణకు పాకడం, హరీశ్‌ పాల్గొన్న ధర్నాలో చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -