భారత విదేశాంగ శాఖ వెల్లడి
న్యూఢిల్లీ : ఇరాన్ నుంచి భారతీయులను తీసుకుని రావడానికి కేంద్రం శనివారం కూడా రెండు విమా నాలను నడిపింది. మషాహద్ నుంచి వచ్చిన మొదటి విమానం శనివారం సాయంత్రం 4.30గంటలకు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా రెండవ విమానం రాత్రి 11.30 గంటలకు చేరుకోనుంది. కొలంబో, ఖాట్మండుల నుంచి వచ్చిన అభ్యర్ధనల మేరకు శ్రీలంక, నేపాల్ జాతీయులను కూడా భారత ప్రభుత్వం తమ విమానాల్లో తరలి స్తోందని టెహరాన్లోని భారత ఎంబసీ ప్రకటించింది. ఇరాన్లో చిక్కుకుపోయిన తమ పౌరులను తీసుకువచ్చిన భారత ప్రభుత్వానికి నేపాల్ విదేశాంగమంత్రి అర్జూ దేబా కృతజ్ఞతలు కూడా చెప్పారు. భారతీయులను తీసుకెళ్లే విమానానికి తమ గగనతల ఆంక్షలను సడలిస్తామని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మషాహద్ నుండి ప్రత్యేక విమానాలు నడిపారు. శుక్రవారం వరకు ఆపరేషన్ సింధు కింద మొత్తంగా 517మంది భారతీయులను ఇరాన్ నుంచి తరలించినట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. మషాహద్ నుంచి వచ్చిన విమానంతో ఈ సంఖ్య 827కి పెరిగిందన్నారు. అంతకు ముందు తుర్కెమినిస్తాన్, అర్మేనియా, ఖతార్ల నుంచి విమానాలు నడిపి ఇరాన్ నుంచి వచ్చిన భారతీయులను స్వదేశానికి చేర్చారు. తుర్కెమినిస్తాన్ లోని అస్గబాట్ నుంచి వచ్చిన ప్రత్యేక విమానం శనివారం తెల్లవారు జామున 3గంటలకు న్యూఢిల్లీ చేరుకుంది.
ఇరాన్ నుంచి 827 మందిని తీసుకువచ్చాం
- Advertisement -
- Advertisement -