Sunday, June 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసాహిత్య ధిక్కార స్వరాలు దాశరథి - ఆరుద్ర

సాహిత్య ధిక్కార స్వరాలు దాశరథి – ఆరుద్ర

- Advertisement -

– తెలంగాణ జీవనస్వరం కృష్ణమాచార్య
– సాహిత్యం విశ్వజనమని చాటేలా జాతీయ సదస్సు : అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొ. ఘంటా చక్రపాణి
– ముగిసిన శతజయంతి సాహితీ మూర్తులు జాతీయ సదస్సు
– 75 పరిశోధనా పత్రాల సమర్పణ
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

సామాజిక పరిణామాలు.. స్వాతంత్య్రానంతరం దేశంలో మార్పుల ఆదారంగా సాహిత్య రచనల ద్వారా ధిక్కార స్వరాన్ని వినిపించిన కవులు దాశరథి కృష్ణమాచార్య – భాగవతుల సదాశివ శంకర శాస్త్రి (ఆరుద్ర) అని డా.అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి అన్నారు. దాశరథి తెలంగాణ జీవన స్వరమని చెప్పారు. ఖమ్మం ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం ప్రిన్సిపాల్‌ డా.మొహ్మద్‌ జకీరుల్లా అధ్యక్షతన ‘శతజయంతి సాహితీ మూర్తులు దాశరథి -ఆరుద్ర జీవితం- సాహిత్యం’పై రెండ్రోజుల జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ముగింపు సభలో చక్రపాణి మాట్లాడుతూ.. ఖమ్మానికి దాశరథికి విడదీయరాని బంధం ఉందన్నారు. ఆయన పాదముద్రలు పడిన ఖమ్మంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం ప్రతిష్టాత్మకంగా దాశరథి- ఆరుద్ర శతజయంతి సదస్సు నిర్వహించటం అభినందనీయమన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో దాశరథి సాహిత్యం, పాటలు ఉత్తేజాన్ని, స్ఫూర్తిని కలిగించాయన్నారు. ఆరుద్ర గొప్ప పరిశోధకుడిగా కవిత్వంలో ప్రయోగ వాదిగా నిలిచారన్నారు. కూనలమ్మ పదాలు రాసిన ఆధునీకుడిగా అభివర్ణించారు. తెలంగాణ
రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో తెలంగాణ దీర్ఘ కావ్యం, త్వమేవాహం రాశారన్నారు.
బడుగుల కన్నీళ్ళ అక్షరబద్ధం

నిజాం నిరంకుశ పాలనలోని బడుగుల కన్నీళ్లను అక్షరబద్ధం చేసిన కవి దాశరథి అని సీనియర్‌ సంపాదకులు కె.శ్రీనివాస్‌ అన్నారు. స్వీయ అనుభవాలు, సామాజిక పరిణామాలు ఆయన ప్రతి రచనలోనూ కనబడతాయని తెలిపారు. ఖమ్మం సాహిత్య గుమ్మమని కళాశాల తెలుగు విభాగం నిరూపించిందని తెలంగాణ ప్రెస్‌ అకాడమీ పూర్వ చైర్మెన్‌ అల్లం నారాయణ అన్నారు. ఇరువురు కవులు అనుభవం, అధ్యయనం ద్వారా సాహిత్యాన్ని సుసంపన్నం చేశారని తెలిపారు. ఈ సదస్సును చరిత్ర పుటల్లో నిలిచే స్థాయిలో నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు. ఈతరం విద్యార్థులు దాశరథి, ఆరుద్ర సాహిత్య సారాంశాన్ని జిజ్ఞాసతో అధ్యయనం చేయాలని పూర్వ బీసీ కమిషన్‌ సభ్యులు జూలూరి గౌరీశంకర్‌ సూచించారు. దాశరథి అంటే తెలంగాణ అగ్నిధారగా నిలిచిన మహాకవి అన్నారు.
దాశరథి తెలంగాణకు సాహిత్య దీపదారిగా.. తన రచనలతో సమాజాన్ని మేల్కొలిపారని సాహిత్య విశ్లేషకులు ఎన్‌.వేణుగోపాల్‌ చెప్పారు. స్వామి రామానంద తీర్థ రూరల్‌ ఇనిస్టిట్యూట్‌ చైర్మెన్‌ ఎన్‌.కిషోర్‌ రెడ్డి, సెంట్రల్‌ యూనివర్సిటీ హిస్టరీ ప్రొఫెసర్‌ భూక్యా భాంగ్యా సదస్సు నిర్వహించిన తీరు స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. కన్వీనర్‌, తెలుగు విభాగాధిపతి డా.పి.రవికుమార్‌ సదస్సు నివేదికను సమర్పిస్తూ రెండు రాష్ట్రాల విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాల అధ్యాపకులు 75 పరిశోధనాపత్రాలు సమర్పించారని వివరించారు. ముగింపు సమావేశ సమన్వయ కర్త, సదస్సు రూపశిల్పి, కాళోజీ అవార్డు గ్రహీత డా.సీతారాం అతిథులకు స్వాగతం పలికారు. సదస్సు ఉద్దేశాన్ని వివరించారు. కార్యక్రమంలో కళాశాల గవర్నింగ్‌ బాడీ సభ్యులు రవిమారుత్‌, వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -