నవతెలంగాణ – ఇంఫాల్: మణిపుర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ అధికార నివాసానికి సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెక్రటేరియట్ కాంప్లెక్స్కు సమీపంలో వాడకంలో లేని భవనంలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు యంత్రాలతో శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ అగ్నిప్రమాదంతో సీఎం నివాసానికి ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటన ఎలా జరిగిందో తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ ప్రైవేట్ భవనం గోవా మాజీ సీఎస్ టి.కిప్జెన్ కుటుంబ సభ్యులకు చెందినదిగా గుర్తించారు. గతేడాది మణిపుర్లో అల్లర్లు చేటుచేసుకోవడంతో అప్పటి నుంచి ఖాళీగా ఉంటున్నట్లు అధికారులు తెలిపారు. జాతుల మధ్య వైరంతో గత సంవత్సర కాలంగా అల్లోకల్లోంగా మారిన మణిపుర్లో తరుచూ ఏదో సంఘటన జరుగుతూనే ఉంది. ఇటీవలే సీఎం బీరేన్ సింగ్ ముందస్తు భద్రత వాహన శ్రేణిపై కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో వాహన డ్రైవర్కు గాయాలయ్యాయి. సాయుధులైన కొందరు కాల్పులు తెగబడ్డారు. రాజధాని ఇంఫాల్కు 36 కిలో మీటర్ల దూరంలో ఈ కాల్పులు జరిగాయి.