కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి డిమాండ్..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్ : సూర్యాపేట జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కీం ద్వారా విద్యనభ్యసిస్తున్న ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ స్కీం ద్వారా చదువుకుంటున్న విద్యార్థులకు ఫీజులు సకాలంలో చెల్లించకపోవడంతో పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.
ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై పది రోజులు కావస్తున్న నేటికీ బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల స్కూళ్లలో జాయిన్ చేసుకోలేదని అన్నారు.గత మూడు సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులకు చదువు చెప్పలేమని చేతులెత్తేసే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దళిత గిరిజన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేసి వారి భవిష్యత్తును కాపాడాలని అన్నారు. సూర్యపేట జిల్లాలో సుమారు 400 మంది విద్యార్థులు జిల్లాలోని మూడు బెస్ట్ అవైలబుల్ కు స్కీమ్ ద్వారా ఎంపిక జరిగిన స్కూళ్లలో చదువుతున్నారని అన్నారు. జిల్లాలోని స్కూళ్లకు నాలుగు సంవత్సరాలుగా సుమారు ఫీజు బకాయి లు కోట్ల రూపాయల వరకు ఫీజులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు.
పాఠశాల ప్రారంభమై పది రోజులు దాటుతున్న విద్యార్థులను స్కూళ్లలో చేర్చుకోకపోవడంతో వారి తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారని అన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని పెండింగ్ ఫీజు బకాయిలు విడుదలయ్యే విధంగా చూడాలని విద్యార్థులకు పాఠశాలలో జాయిన్ చేయించే ప్రయత్నం చేయాలని తెలిపారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవార్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిపిటిఎల్ఎఫ్ జిల్లా కన్వీనర్ జే నరసింహారావు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విద్యార్థుల తల్లిదండ్రుల యూనియన్ అధ్యక్షులు గట్టు సతీష్ కెవిపిఎస్ జిల్లా నాయకులు నందిపాటి సతీష్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్వాయి నాగయ్య,బిక్షం,శ్రవణ్ కుమార్,సునీత,కోటయ్య, శ్రీను,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.