నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తర్ప్రదేశ్లోని మేరఠ్లో జరిగిన కరెన్సీ ఫెస్టివల్ చూపరులను ఆకట్టుకుంది. ఈ ఫెస్టివల్లో మొఘలులు, గుప్తులు, బ్రిటిష్ కాలం నాటి కరెన్సీ నాణెలు, నోట్లు ప్రదర్శించారు. దేశంలోని పది రాష్ట్రాలల్లోని 50 నగరాల నుంచి వ్యాపారులు, పురాతన కరెన్సీపై ఆసక్తి ఉన్నవారు ఈ ఫెస్టివల్ కు వచ్చారు. పురాతన కాయిన్స్, నోట్లను కొందరు విక్రయించగా, తమకు నచ్చిన వాటిని ఇంకొందరు కొనుగోలు చేశారు.
నాణేలు చరిత్రకు సజీవ రుజువులు అని చెబుతారు చరిత్రకారులు. అది నిజమేనని మేరఠ్ కరెన్సీ ఫెస్టివల్ నిరూపించింది. చరిత్ర, రాజకీయ పరిస్థితి, భౌగోళిక పరిస్థితి, వాణిజ్యం అలాగే జీవనశైలి, ఓ పాలకుడు ఎంతకాలం పరిపాలించాడనే దాని గురించి నాణేలు మనకు ప్రతిదీ తెలియజేస్తాయి. కాలక్రమేణా జరిగిన మార్పుల కారణంగా కొన్ని కరెన్సీ నాణెలు, నోట్లు చలామణిలో లేవు.మేరఠ్ కరెన్సీ ఫెస్టివల్ లో 25 పైసల నాణెం రూ. 8 వేలు పలుకుతోంది. చలామణిలో లేని కరెన్సీ నోట్లు, కాయిన్లు కూడా చాలా విలువైనవిగా మారిపోయాయి. ఆంగ్లేయులు, మెుఘలుల కాలం నాటి రూ.2 నాణెం మూడు లక్షల రూపాయిల ధర పలుకుతోంది. 50 ఏళ్ల క్రితం వెయ్యి రూపాయల నోటు ధర రూ.40 వేలు. 108 ఏళ్ల నాటి రూపాయి నోటు ధర రూ.10,000-రూ.12,000 వరకు ఉంది. మొఘల్ కాలంనాటి రూపాయి నోటు ధర రూ.20,000 పలుకుతోంది.బ్రిటిష్ కాలం నాటి కరెన్సీకి ఫుల్ డిమాండ్
ఆంగ్లేయుల కాలం నాటి రూపాయి నోటు విలువ రూ.30,000- రూ.35,000. 5 రూపాయల నోటును కూడా రూ. 75,000 కు కొనుగోలు చేస్తున్నారు. ఈ కరెన్సీ ఫెస్టివల్ లో రూ. 125, రూ. 225, రూ. 350, రూ. 400 స్మారక నాణేలు కూడా పుష్కలంగా ఉన్నాయి. కాగా, మేరఠ్ లో ఇలాంటి కార్యక్రమాన్ని తొలిసారిగా నిర్వహిస్తున్నట్లు కరెన్సీ ఫెస్టివల్ నిర్వాహకుడు మనోజ్ జైన్ చెప్పారు.