నవతెలంగాణ-హైదరాబాద్: ఆరుసార్లు వాయిదా పడుతూ వస్తున్న శుభాన్ష శుక్లా అంతరిక్ష యాత్రకు ఎట్టకేలకు ముహుర్తం ఫిక్స్ అయింది. యాక్సియం-4 మిషన్పై మంగళవారం నాసా కీలక అప్డేట్ ఇచ్చింది. జూన్ 25న మధ్యాహ్నం 12:01 గంటలకు రోదసి యాత్ర ప్రారంభం కానుందని పేర్కొంది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్లో దీన్ని ప్రయోగించనున్నట్లు వెల్లడించింది.
వాస్తవానికి ఈనెల 10న స్పేస్ లాంఛ్ సెంటర్ ఉన్న ఫ్లోరిడా ప్రాంతంలో వాతావరణం అనుకూలించకపోవడం, అనంతరం పలుమార్లు టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో ఇప్పటికి రోదసి యాత్ర ఆరు సార్లు వాయిదా పడింది. స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన డ్రాగన్ వ్యోమ నౌకలో వీరు రోదసిలోకి వెళ్లనున్నారు. అయితే, ఈ స్పేస్ క్యాప్సూల్ను ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి మోసుకెళ్లనుంది. భూమి నుంచి బయలుదేరిన 28 గంటల తర్వాత వ్యోమనౌక.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)తో అటాచ్ అవుతుంది. శుభాంశు శుక్లా బృందం అక్కడే 14 రోజుల పాటు బస చేసి అనేక ప్రయోగాలు నిర్వహించనుంది.