నవతెలంగాణ-హైదరాబాద్: భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోకి వెళ్లిన రెండో భారత వ్యోమగామిగా నిలిచారు. 1984లో సోవియట్ మిషన్లో భాగంగా వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ అంతరిక్ష యాత్ర చేసిన నాలుగు దశాబ్దాల తర్వాత శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి ప్రయాణించిన రెండో భారతీయ వ్యోమగామిగా నిలిచారు. ఈ ప్రయాణం కోసం శుభాంశు నెలరోజుల పాటు క్వారంటైన్లో ఉన్నారు. తాను అవసరమైన పరికరాలు, సాధనాలు మాత్రమే కాకుండా బిలియన్ల ప్రజల హృదయాల ఆశలను, కలలను తనతో పాటు తీసుకువెళుతున్నాను” అని ఇటీవల శుక్లా మీడియాతో పేర్కొన్నారు. ప్రయాణానికి ముందు శుక్లా తన కుటుంబానికి ఒక సందేశం పంపారు. ”నాకోసం వేచి ఉండండి. నేను వస్తున్నాను” అని పేర్కొన్నారు.
సాంకేతిక కారణాలు, వాతవారణం కారణంగా ఆక్సియం-4 ప్రయోగం అనేకసార్లు వాయిదా పడింది. నాసా ఆరవసారి జూన్ 25 ప్రయోగం చేపట్టనున్నట్లు ప్రకటించింది.ఆక్సియం -4 ప్రయోగంలో భాగంగా బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు ఫాల్కన్-9 రోదసీలోకి దూసుకువెళ్లింది. ఈ నౌకలో శుక్లాతో సహా నలుగురు వ్యోమగాములు ఉన్నారు. ఈ ప్రయోగాన్ని ఇస్రో, నాసాలు సంయుక్తంగా చేపట్టాయి.