నవతెలంగాణ-హైదరాబాద్: పదో తరగతి వార్షిక పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఇ) తెలిపింది. 2026 నుండి ఇది అమల్లోకి రానుందని పరీక్షల కంట్రోలర్ సన్యం భరద్వాజ్ బుధవారం ప్రకటించారు. ఫిబ్రవరిలో నిర్వహించే తొలి విడత పరీక్షలను తప్పనిసరి చేయనున్నామని, మే నెలలో నిర్వహించే రెండో విడత పరీక్షలను ఆప్షనల్గా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఫిబ్రవరి పరీక్షల ఫలితాలను ఏప్రిల్లో వెల్లడిస్తామని, మే పరీక్షల ఫలితాలను జూన్లో వెల్లడిస్తామని తెలిపారు. విద్యార్థులు తమ స్కోర్లను మెరుగుపరుచుకోవడానికి ఈ విధానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అంతర్గత మూల్యాంకనం (ఇంటర్నల్ అసెస్మెంట్) ఏడాదికి ఒక్కసారే ఉంటుందని అన్నారు. విద్యార్థులు సైన్స్, మేథమెటిక్స్, సోషల్ సైన్స్, లాంగ్వేజ్లలో మూడు సబ్జెక్టులను ఎంచుకుని బెటర్మెంట్ కోసం రాసుకోవచ్చని వెల్లడించారు. చలి ఎక్కువగా ఉండే (వింటర్ బౌండ్) స్కూళ్లలోని పదో తరగతి విద్యార్థులకు ఏదో ఒక ఫేజ్లో పరీక్షలు రాసే అవకాశం ఉంటుంది.
సీబీఎస్ఇ ముసాయిదా నిబంధనలు ఫిబ్రవరిలో విడుదలయ్యాయి. తల్లిదండ్రులు, విద్యార్థుల అభిప్రాయాల కోసం పబ్లిక్ డొమైన్లో ఉంచింది. విద్యార్థుల్లో బోర్డు పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు, పరీక్షలకు అధిక విలువను తొలగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ విద్యా విధానం (ఎన్ఇపీ) పేర్కొంది.