Thursday, June 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరాష్ట్రంపై కేంద్రం వివక్ష

రాష్ట్రంపై కేంద్రం వివక్ష

- Advertisement -

– నిధులు, పథకాల విషయంలో ఇంత నిర్లక్ష్యమా?
– అబద్ధాల ప్రచారంలో బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా
– పోతిరెడ్డి ప్రాజెక్టు కట్టుకునేందుకు జీవోలు ఇచ్చిందెవరు?
– కృష్ణా జలాలపై హరీశ్‌రావు ఎందుకు సంతకం పెట్టారు : టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పథకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్షను కొనసాగిస్తున్నదని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌ విమర్శించారు. మోడీ సర్కారు ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అభూత కల్పనలతో కూడిన సోషల్‌ మీడియా ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. ఆ పార్టీ తన అనుకూల సోషల్‌మీడియా ద్వారా అవాస్తవాలను, అబద్ధాలను ప్రచారం చేస్తూ…ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నదని విమర్శించారు. ఆనాడు పోతిరెడ్డి ప్రాజెక్టు కట్టుకునేందుకు జీవోలు ఇచ్చింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. కృష్ణా జలాల విషయంలో ఎందుకు సంతకం పెట్టారంటూ మాజీ మంత్రి హరీశ్‌రావును ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో వివిధ కార్పొరేషన్ల చైర్మెన్లు ఈరవత్రి అనిల్‌, జనక్‌ ప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెెడ్డి, పార్టీ నాయకులు వేణు గౌడ్‌, అక్బర్‌, కోట్ల శ్రీనివాస్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో పరిపాలన అద్భుతంగా సాగుతుంటే, బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు. కాంగ్రెస్‌ హయాంలో జరిగిన సామాజిక న్యాయం ఏ ప్రభుత్వంలోనూ జరగలేదని గుర్తు చేశారు. ఆ పార్టీ ప్రభుత్వం కేవలం ఎన్నికల కోసమే ఆనాడు పలు పథకాలను తీసుకొచ్చిందని ఎద్దేవా చేశారు. హుజురాబాద్‌ ఉప ఎన్నిక కోసమే దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో బీజేపీ నేతలు నోరు మెదపడం లేదని విమర్శించారు. వాటిని అమలు చేసి తీరుతామని ఆయన చెప్పారు.
జూబ్లీహిల్స్‌లో గెలుపు తథ్యం
జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ గెలుపు తథ్యమని మహేశ్‌కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు పార్టీని సన్నద్ధం చేసేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసి కాంగ్రెస్‌ సర్కారు రికార్డు సృష్టించిందని చెప్పారు. మూడు ముక్కలాటతో బీఆర్‌ఎస్‌ పని ముగిసిందని తెలిపారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దీక్షకు బీజేపీ రాజ్యసభ సభ్యులు ఆర్‌. కృష్ణయ్య మద్దతు ఇవ్వటం విచారకరమన్నారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన బీఆర్‌ఎస్‌ సర్కారు ఫోన్‌ ట్యాపింగ్‌ చేసిందని విమర్శించారు.
హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం
స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్‌ 30 లోపు నిర్వహించాలన్న హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మహేశ్‌కుమార్‌ చెప్పారు. నాలుగు నెలల క్రితమే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సిందనీ, అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు పోవాలనుకోవడం వల్ల ఆలస్యమైందని చెప్పారు. ఎస్సీ, బీసీ వర్గీకరణ చేసి కేంద్రానికి పంపించామనీ, దీన్ని ఇప్పటివరకు ఆమోదించలేదని తెలిపారు. ఈ విషయంలో ఒక్క బీజేపీ మంత్రి కూడా నోరు మెదపడం లేదని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -