భారత్ 5 ట్రిలియన్ డాలర్ల జీడీపీ సాధించొచ్చు :
మంత్రి పియూశ్ గోయల్ అంచనా
న్యూఢిల్లీ : వచ్చే మూడేండ్లలో భారత ఆర్థిక వ్యవస్థ మరింత దూసుకుపోనుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూశ్ గోయల్ అన్నారు. 2027 నాటికి భారత్ 5 ట్రిలియన్ డాలర్ల (రూ.430 లక్షల కోట్లు) జీడీపీ సాధించొచ్చని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం, వ్యాపార సంఘాలు, పరిశ్రమలు సహా 140 కోట్ల మంది భారతీయులు ముందుకు వెళ్తున్నారన్నారు. మర్చంట్స్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (ఎంసీసీఐ) ఏర్పాటు చేసిన ఓ వర్చూవల్ సెషన్లో మంత్రి పియూశ్ గోయల్ మాట్లాడుతూ.. బలమైన స్థూల ఆర్థిక పునాదితో దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థ దృఢంగా ఉందన్నారు.
దేశంలో ద్రవ్యోల్బణం అత్యల్పంగా మూడు శాతానికి తగ్గిందన్నారు. భారత్ 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థను అందుకోవడం కోసం మూలధన వ్యయాల పెంపు, సులభతర వ్యాపార నిర్వహణ, వ్యాపార నిర్వహణ ఖర్చులు తగ్గడం, కార్మికులతో తయారీకి ప్రాధాన్యం, ప్రపంచ మార్కెట్పై దృష్టి సారించడం వంటి వాటిపై కీలక చర్యలను తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రపంచ దేశాలతో పోటీ పడగలిగేలా భారత్ తనను తాను మలుచుకుందన్నారు. రాబోయే దశాబ్ద కాలంలో దేశానికి డిజిటల్ మార్కెట్ కీలకమన్నారు. ప్రపంచంలో జపాన్ను అధిగమించి భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ఇటీవల నిటి ఆయోగ్ తెలిపింది. దేశ స్థూల దేశీయోత్పత్తి 4.19 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.356 లక్షల కోట్ల)కు చేరుకుంది. జపాన్ కంటే భారత జీడీపీ 4.187 బిలియన్ డాలర్లు అధికంగా ఉందని పేర్కొంది. అమెరికా, చైనా, జర్మనీ తరవాత స్థానంలో భారత్ ఉందని వెల్లడించింది.
మూడేండ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ
- Advertisement -
- Advertisement -