నవతెలంగాణ – హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో సంచలనం సృష్టించిన లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక లైంగికదాడి కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో తాజాగా మరో కీలక అరెస్ట్ జరిగింది. బాధితురాలు చదువుతున్న సౌత్ కోల్కతా లా కాలేజీకి చెందిన సెక్యూరిటీ గార్డును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టుతో ఈ కేసులో పట్టుబడిన నిందితుల సంఖ్య నాలుగుకు చేరింది.
వివరాల్లోకి వెళ్తే.. సౌత్ కోల్కతా లా కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై ఇటీవల కళాశాల ప్రాంగణంలోనే సామూహిక లైంగికదాడి జరిగింది. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసిన కోల్కతా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి చెందిన ఓ స్థానిక నాయకుడు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
తాజాగా, ఈ కేసులో సెక్యూరిటీ గార్డు పాత్ర కూడా ఉన్నట్టు గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. విద్యార్థులకు రక్షణగా ఉండాల్సిన గార్డే ఈ దారుణంలో పాలుపంచుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కళాశాల ఆవరణలోనే ఈ దారుణం జరగడం, అందులో రాజకీయ నాయకుడితో పాటు కాలేజీ సిబ్బంది ప్రమేయం కూడా ఉండటంపై విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ఘటనతో నగరంలో మరోసారి మహిళల భద్రతపై చర్చ మొదలైంది. కేసులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.