– కేంద్రం బీసీ బిల్లును ఆమోదించాలి : ఢిల్లీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే రైలు చక్రాల్ని ముందుకు కదలనివ్వబోమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై మంగళవారం నాడిక్కడ కాన్ట్సిట్యూషన్ క్లబ్లో ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న మోసాలకు నిరసనగా, బీసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈనెల 17న రైల్రోకో నిర్వహిస్తున్నామన్నారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని హెచ్చరించారు. బిల్లు ఆమోదం పొందకుంటే దక్కన్ నుంచి ఢిల్లీకి ఒక్క రైల్ను కూడా వెళ్లనివ్వబోమని చెప్పారు. బీజేపీ డీఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనలో అనేక లోపాలు ఉన్నాయన్నారు. 2014లో కేసీఆర్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో 52 శాతం బీసీలు ఉన్నట్టు తేలిందనీ, కాంగ్రెస్ సర్వేలో బీసీలు కేవలం 46 శాతానికే పరిమితమయ్యారని చెప్పారు. ఢిల్లీ పర్యటనల్లో సీఎం రేవంత్రెడ్డి హాఫ్సెంచరీ పూర్తి చేశారని ఎద్దేవా చేశారు. ప్రాంతీయ పార్టీలతోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
17న జరిగే రైల్రోకో ట్రైలరే
- Advertisement -
- Advertisement -