– ఆయన వ్యాఖ్యలు క్షమించరానివి :బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
– మండలి చైర్మెన్ గుత్తాకు ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను వెంటనే ఆ పదవి నుంచి సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తనపై అనుచిత వాఖ్యలు చేశారని శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డికి ఫిర్యాదు చేశారు. విచక్షణాధికారాలు ఉపయోగించి ఆయన్ను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని ఆమె కోరారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ మల్లన్న చేసిన వ్యాఖ్యలు క్షమించరానివని అన్నారు. ”తెలంగాణలో మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఉంది. బోనం ఎత్తుకున్న ఆడబిడ్డను అమ్మవారిలా చూసే సంస్కృతి మనది. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో మహిళలు రాజకీయాల్లోకి వస్తూ ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులు పరుషపదజాలంతో విమర్శలు చేస్తే వచ్చేవాళ్లు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి ఉంటుంది. ఉచ్ఛరించలేని దారుణమైన వ్యాఖ్యలను మల్లన్న చేశారు. ఆడబిడ్డలు రాజకీయాల్లోకి రావద్దా? ఏదైనా ఉంటే అంశం ప్రాతిపదికన మాట్లాడాలి. ఏడాదిన్నరగా బీసీ సమస్యలపై తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేస్తున్నాం. ఏ రోజూ తీన్మార్ మల్లన్నను ఒక్క మాట అనలేదు. ఆయన చేసిన వ్యాఖ్యలకు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన జాగృతి కార్యకర్తలపై కాల్పులు జరుపుతారా? ఇది ప్రజాస్వామ్యం.
దీనిలో అనేకమంది ప్రజల జీవితాలు ముడిపడి ఉన్నాయి. జాగృతి ఎన్నో కార్యక్రమాలు చేసింది.. అందులో బీసీ ఉద్యమం ఒకటి. బీసీ అయినంత మాత్రాన.. మల్లన్న ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. మల్లన్న చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ను ఫిర్యాదు చేస్తా” అని కవిత అన్నారు. నన్ను బయట తిరగనివ్వను అనటానికి ఆయన ఎవరని ప్రశ్నించారు. పరుష పదజాలాన్ని తెలంగాణ ప్రజలు క్షమించరని జరిగిన ఘటన స్పష్టం చేస్తున్నదని అన్నారు. తీర్మార్ మల్లన్నను అరెస్ట్ చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. సీఎం ఇంటి బిడ్డలకు ఒక న్యాయం. ఇతరులకు మరొక న్యాయమా అంటూ ప్రశ్నించారు. మల్లన్నను అరెస్ట్ చేయకుంటే.ఆయన వెనుక ముఖ్యమంత్రి ఉన్నారుకోవాల్సి ఉంటుందని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
డీజీపీకి ఫిర్యాదు…
తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై డీజీపీకి కవిత ఫిర్యాదు చేశారు. పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలతో ఆమె ఆదివారం డీజీపీ కార్యాలయానికి వచ్చారు. ”గన్ మెన్స్ ఎందుకు ఫైర్ చేయాల్సి వచ్చిందో తెలియాలి. మల్లన్న ఆదేశాలు లేకుండా గన్ మెన్స్ షూట్ చెయ్యరు. మా కార్యకర్తలపైన కాల్పులు జరిపిన తీన్మార్ మల్లన్న గన్మెన్లను వెంటనే డిస్మిస్ చెయ్యాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఏ గన్మెన్ కానీ పోలీసులు కానీ కాల్పులు జరపలేదు” అని కవిత వ్యాఖ్యానించారు. సంఘటనపై లోతైన దర్యాప్తు చేయాలని కోరారు.
కవిత ఇంటి వద్ద బందోబస్తు
తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి అనంతర పరిస్థితుల నేపథ్యంలో బంజారాహిల్స్లోని ఎమ్మెల్సీ కవిత నివాసం, కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కవిత ఇంటికి వెళ్లే మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. అటు వైపు వెళ్లే వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.