Wednesday, July 16, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుడేటా సిటీగా హైదరాబాద్‌

డేటా సిటీగా హైదరాబాద్‌

- Advertisement -

ట్రిలియన్‌ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యం
ప్రాణాలను రక్షించే ప్లాస్మా చికిత్సల అభివృద్ధికి ఐకార్‌ పునాది
కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రూ.3.28 లక్షల కోట్ల పెట్టుబడులు : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఐకార్‌ బయోలాజిక్స్‌ కొత్త యూనిట్‌కు సీఎం శంకుస్థాపన
నవతెలంగాణ-శామీర్‌పేట

రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ డేటా సిటీగా మారడంతో పాటు ప్రపంచ బల్క్‌ డ్రగ్స్‌ రాజధానిగా హైదరాబాద్‌ రూపుదిద్దుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం జీనోమ్‌ వ్యాలీలో ఐకార్‌ బయోలాజిక్స్‌ కొత్త యూనిట్‌కు మంగళవారం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐకార్‌ బయోలాజిక్స్‌ సంస్థ ప్రాణాలను మెరుగుపరిచే, రక్షించే ప్లాస్మా-ఉత్పన్న చికిత్సలను తయారు చేయడానికి, అభివృద్ధి పరచడానికి పునాది వేసిందని తెలిపారు. దేశంలోనే 33 శాతం వ్యాక్సిన్స్‌, బల్క్‌ డ్రగ్స్‌లో 43 శాతం ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. కోవిడ్‌ సమయంలో జీనోమ్‌ వ్యాలీ నుంచే ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్‌ను ఎగుమతి చేసిన ఘనత ఇక్కడి పారిశ్రామికవేత్తలకు దక్కిందని తెలిపారు. ప్రభుత్వా లు మారినా పారిశ్రామిక విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే నిర్ణయాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మరింత సరళమైన విధానాలతో ముందుకెళ్తుందని, నూతన పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తుందని, వారికి అవసరమైన సహకారాన్ని అందిస్తుందని స్పష్టంచేశారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.3 లక్షల 28 వేల కోట్ల పెట్టుబడులు సాధించామన్నారు. ప్రపంచ దేశాలతో పోటీ పడాలని, అధునాతన విధానాలను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 2047 నాటికి దేశం 30 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని నిర్దేశించగా, అందులో తెలంగాణ నుంచి 10 శాతం మేరకు కంట్రిబ్యూట్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాబోయే పదేండ్లలో తెలంగాణను 1 ట్రిలియన్‌ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి శ్రీధర్‌బాబు ఐకార్‌ లోగో ఆవిష్కరించగా, మంత్రి వివేక్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అంతకుముందు మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ మను చౌదరి, అదనపు కలెక్టర్‌ విజయేందర్‌రెడ్డి ముఖ్యమంత్రికి పుష్ఫగుచ్ఛంతో స్వాగతం పలికారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -