Saturday, July 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబీసీల కోసం తెలంగాణ జాగృతి పోరాటం

బీసీల కోసం తెలంగాణ జాగృతి పోరాటం

- Advertisement -

– ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో 25 వేల మంది బీసీలు ప్రజా ప్రతినిధులు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. బుధవారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తన నివాసంలో యూపీఎఫ్‌ నాయ కులు, 72 కులాల ప్రతినిధులతో ఆమె సమావేశమ య్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఆ పదవుల్లో సగం అవకాశాలు మహిళలకు దక్కుతాయని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే ఇప్పటి వరకు రాజకీయ అవకాశాలు దక్కని కులాలకు సబ్‌ కోటా కల్పించాలని ఆమె డిమాండ్‌ చేశారు. సర్పంచులు, ఎంపీపీలుగా ఇప్పటి వరకు రాజకీయ అవకాశాలు దక్కని ఎన్నో కులాలు బీసీల్లో ఉన్నాయని చెప్పారు. బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచడం ఎంత ముఖ్యమో.. రాజకీయ అవకాశాలు దక్కని వారికి పదవులు దక్కేలా ఉప వర్గీకరణ చేయడమూ అంతే ముఖ్యమని కవిత అభిప్రాయపడ్డారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగ సవరణ కేంద్రం చేయాల్సి ఉందని తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్‌ పాస్‌ చేసిన బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ క్యాబినెట్‌ చేసిన సవరణ తీర్మానం గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉందని చెప్పారు. గవర్నర్‌ క్యాబినెట్‌ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసి గెజిట్‌ జారీ చేయాలని కవిత విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌ ఆర్డినెన్స్‌ ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం కేవియట్‌ వేయకుంటే ఎవరైనా కోర్టుకు వెళ్లి రిజర్వేషన్లకు అడ్డు తగిలే ప్రమాదమున్నదని హెచ్చరించారు. ఆ అవకాశం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రిజర్వేషన్లను పెంచుతూ చట్ట సవరణ చేసే అధికారం కేంద్రం పరిధిలో ఉంటే, ఉన్న రిజర్వేషన్లలో ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికుందని గుర్తుచేశారు. రాజకీయ అవకాశాలు దక్కని కులాల నుంచి సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్లు కావాలంటే ఉప వర్గీకరణ ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేవియెట్‌ వేయకుండా ఆర్డినెన్స్‌ ఇస్తే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతామని హెచ్చరించారు. దీనిపై న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వం ఫీ రీయింబర్స్‌ మెంట్‌ బకాయిలు ఇవ్వకుండా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను వేధిస్తోందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రూ.8 వేల కోట్ల ఫీ రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -