కొన్నేండ్ల క్రితం చిన్న వార్తకు కూడా భారీ స్పందన వచ్చేది. బాధితులకు న్యాయం జరిగేది. ఇప్పుడు బాధితుల పక్షాన ఎన్ని వార్తలు రాసినా, ఎన్ని వాస్తవాలు చెప్పినా, బాధితులకు న్యాయం జర్కపోగా, డోంట్ కేర్ అనే పరిస్థితులు వచ్చాయి. అది పలానా పార్టీ పేపర్ అందుకే అలా రాస్తున్నారు. ఇది పలానా పార్టీ నాయకుడికి చెందిన టీవీ లేదా పేపర్. వారు అలాగే రాస్తారు. అందులో వాస్తవం లేదు. ఆ పార్టీ పేపర్ కాబట్టి వారికి అనుకూలంగా రాస్తారులే అని లైట్గా తీసుకుంటున్నారు. వాస్తవాలను దాచిపెట్టి తమ పని కానిస్తున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొన్ని స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని మాత్రం ఏదో ఒక వ్యక్తిని పొగడ్తల్లో ముంచెత్తడం, ఏదో ఒక పార్టీకి అనుబంధంగా మారి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ప్రచారం చేసి మనుషుల మైండ్సెట్ మార్చడం, ఏదో అంశాన్ని తీసుకుని దాన్ని ప్లాన్ ప్రకారం ప్రచారంలోపెట్టడం.. ఇంకొన్ని బ్లాక్మొయిల్కు పాల్పడుతూ కోట్లకు పడగలెత్తు తున్నాయి. మరికొన్ని వ్యక్తిగత విషయాలను బజారు కీడ్చుతూ రాక్షసానందం పొందుతున్నాయి. తాజాగా ఏ సంఘటన వింటే షాక్ తగలక మానదు. ఓ సోషల్ మీడియా రిపోర్టర్ను పట్టుకుని ఏం చదివావు అంటే టెన్త్ క్లాస్ సార్ అన్నాడు. ఇంటర్కు పోకుండా మీడియాలోకి ఎందుకొచ్చావంటే, చదువెందుకు సార్… గొట్టం పట్టుకోవస్తే చాలు. రాయాల్సిన అవసరం లేదు. స్టోరీ అవసరం లేదు. యాంకర్ పార్ట్ అక్కర్లేదు. క్షేత్రస్థాయిలో ఎవరో ఒకర్ని పట్టుకుని ఒకటో రెండు ప్రశ్నలు అడిగితే చాలు అతనే అన్ని చెబుతారు. దీనికి ఒక వీడియో ఎడిటింగ్ వస్తే చాలు. దానికి ఫోన్లో యాప్లు ఉండనే ఉన్నాయి అని చెప్పడంతో ఆశ్చర్యమేసింది. బాధితుల పక్షాన జర్నలిజం నిలబడే రోజు కోసం వేచిచూద్దాం… బీ రెడీ.!
– గుడిగ రఘు