నవతెలంగాణ-హైదరాబాద్: పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రభుత్వ బాలుర కళాశాల హాస్టల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిపై సెకెండియర్ విద్యార్థులు దాడి చేసిన ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వసతిగృహ సంక్షేమ అధికారిని విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వాచ్మన్ సంజేశ్వరరావుపై వేటు వేస్తూ ఉత్తర్వులిచ్చారు. దాడి చేసిన విద్యార్థులను హాస్టల్ నుంచి పంపించి వేయాలని ఆదేశించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
దాచేపల్లి బాలుర బీసీ హాస్టల్లో దారుణం..
నవతెలంగాణ-హైదరాబాద్: పల్నాడు జిల్లా దాచేపల్లిలోని బాలుర బీసీ హాస్టల్లో దారుణం జరిగింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు విచక్షణా రహితంగా దాడి చేశారు. దాడి దృశ్యాలను వీడియోలో చిత్రీకరించారు. గురువారం జరిగిన ఈ సంఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. దాచేపల్లికి సమీపంలోని శ్రీనగర్కు చెందిన విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతూ బిసి హాస్టల్లో ఉంటున్నాడు. స్థానిక ఓ ప్రయివేటు కాలేజీలో ఇంటర్ మీడియట్ చదువుతున్న అమ్మాయితో చనువుగా మాట్లాడుతున్నాడని అతనిపై హాస్టల్కు చెందిన ఇద్దరు సీనియర్ విద్యార్థులు, మరో ముగ్గురు యువకులతో కలిసి గురువారం రాత్రి హాస్టల్ గదిలో దాడి చేశారు. కాళ్లతో విచక్షణారహితంగా తన్నారు.
దండం పెడుతున్నా విడిచిపెట్టకుండా దాడిని కొనసాగించారు. కరెంట్ వైరుతో షాక్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. తనపై జరిగిన దాడిని మరుసటి రోజు శుక్రవారం బాధిత విద్యార్థి వార్డెన్కు చెప్పగా ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. హాస్టల్కు వచ్చిన పోలీసులు విచారణ చేసి… విద్యార్థుల మధ్య సాధారణ వివాదమని భావించి వెళ్లిపోయారు. అయితే, శనివారం మధ్యాహ్నం దాడి ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దాడి తీవ్రతను పోలీసులు గుర్తించారు. దాడికి పాల్పడిన ఐదుగురిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్టు గురజాల డిఎస్పి జగదీష్ మీడియాకు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. ఇదిలా ఉండగా దాడిలో కీలకమైన యువకుడు గతంలోనూ పలుమార్లు 25 మంది వరకు విద్యార్థులపై దాడి చేశాడని, అప్పుడు కూడా అమ్మాయి విషయమే కారణమని తెలిసింది.