నవతెలంగాణ – హైదరాబాద్ : మూడు దశాబ్దాలకు పైగా నిరీక్షణకు తెరదించుతూ వెస్టిండీస్ జట్టు పాకిస్థాన్పై చారిత్రక వన్డే సిరీస్ విజయాన్ని అందుకుంది. కెప్టెన్ షాయ్ హోప్ (120 నాటౌట్) అద్భుత శతకంతో కదం తొక్కగా, యువ పేసర్ జేడెన్ సీల్స్ (6/18) నిప్పులు చెరిగే బౌలింగ్తో పాక్ బ్యాటింగ్ను కుప్పకూల్చాడు. ట్రినిడాడ్లోని బ్రియన్ లారా క్రికెట్ స్టేడియంలో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో 202 పరుగుల భారీ తేడాతో గెలిచిన విండీస్, 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. 1991 తర్వాత పాకిస్థాన్పై వెస్టిండీస్ వన్డే సిరీస్ గెలవడం ఇదే తొలిసారి.
ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఆరంభంలోనే నసీమ్ షా, బ్రాండన్ కింగ్ (5)ను పెవిలియన్ చేర్చడంతో విండీస్ తడబడింది. అయితే, కెప్టెన్ షాయ్ హోప్ అద్భుతమైన ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. ఎవిన్ లూయిస్ (37), రోస్టన్ చేజ్ (36)లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. చివర్లో జస్టిన్ గ్రీవ్స్ (43 నాటౌట్)తో కలిసి ఏడో వికెట్కు అజేయంగా 110 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఈ క్రమంలో హోప్ తన వన్డే కెరీర్లో 18వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి 10 ఓవర్లలో విండీస్ బ్యాటర్లు ఏకంగా 119 పరుగులు పిండుకోవడంతో, నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 294 పరుగుల భారీ స్కోరు సాధించింది. పాక్ బౌలర్లలో నసీమ్ షా, అబ్రార్ అహ్మద్ చెరో రెండు వికెట్లు తీశారు.
295 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్, పేసర్ జేడెన్ సీల్స్ ధాటికి పేకమేడలా కూలిపోయింది. కొత్త బంతితో విధ్వంసం సృష్టించిన సీల్స్, పాక్ టాప్ ఆర్డర్ను కకావికలం చేశాడు. కేవలం 23 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పాకిస్థాన్ పీకల్లోతు కష్టాల్లో పడింది. సల్మాన్ అలీ ఆఘా (30) ఒక్కడే కాసేపు ప్రతిఘటించినా, మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో పాకిస్థాన్ జట్టు 29.2 ఓవర్లలో కేవలం 92 పరుగులకే చాపచుట్టేసింది.