నవతెలంగాణ – హైదరాబాద్: ఖమ్మంలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది.. ఓ షాపుకు నిప్పంటించి గంజాయి బ్యాచ్ హల్ చల చేశారు. గంజాయి మత్తులో రెచ్చిపోయిన దుండగులు షాపుకు నిప్పంటించి యజమానిపై దాడికి దిగారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఈ ఘటన ఖమ్మం – వైరా రోడ్డులోని ఎస్ఆర్ గార్డెన్స్ సమీపంలో చోటు చేసుకుంది. గంజాయి మత్తులో అటుగా వెళ్తున్న వాహనాలను ఆపి.. వారిపై దుండగులు దాడి చేసి వీరంగం సృష్టించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ షాపుకు నిప్పంటించి, యజమానిపై దాడికి దిగారు. షాపుకు నిప్పంటించే క్రమంలో అక్కడే పార్క్ చేసి ఉన్న బైక్ కు కూడా మంటలు అంటుకున్నాయి.
షాపులోని వస్తువులకు కూడా మంటలు అంటుకున్నాయి. అడ్డుకోవడానికి ప్రయత్నించిన షాపు ఓనర్ పై కూడా దుండగులు దాడికి దిగారు. దీంతో యజమానికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు షాపు యజమాని. యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి బ్యాచ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.