నవతెలంగాణ-హైదరాబాద్ : ముంబయికి చెందిన ఓ వ్యాపారవేత్తను మోసం చేశారన్న అభియోగాలపై నటి శిల్పా శెట్టి దంపతులపై కేసు నమోదైంది. పెట్టుబడి ఒప్పందానికి సంబంధించి రూ.60 కోట్లు మోసం చేశారని శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలపై దీపక్ కొఠారి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు జుహు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దీనిని ఆర్థిక నేరాల విభాగానికి (EOW) బదిలీ చేయగా.. ప్రస్తుతం ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.
2015- 2023 వరకు ఓ వ్యాపార ఒప్పందం నిమిత్తం రూ.60.48 కోట్లు ఇచ్చానని, కానీ ఆ డబ్బును వ్యక్తిగత ఖర్చులకు ఉపయోగించుకున్నారని దీపక్ కొఠారి ఆరోపించారు. షాపింగ్ ప్లాట్ఫామ్ బెస్ట్ డీల్ టీవీకి వారు డైరెక్టర్లుగా ఉన్న సమయంలో దీపక్ ఒప్పందం చేసుకున్నారు. అప్పటికి ఆ కంపెనీలో 87 శాతం కంటే ఎక్కువ వాటా కలిగి ఉన్నారు. 2016 ఏప్రిల్లో తనకు శిల్పా శెట్టి వ్యక్తిగత హామీ కూడా ఇచ్చారని దీపక్ తెలిపారు. ఆ తర్వాత కొన్ని నెలలకే ఆమె డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారని, ఈ విషయాన్ని బయటకు చెప్పలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఆ కంపెనీ దివాలా తీసిన విషయం తెలిసిందని చెప్పారు.