– మత విభజనతో కాలం వెళ్లదీస్తున్న కేంద్ర ప్రభుత్వం
– 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సన్నద్ధం
– కార్మిక హక్కుల కోసం ఐక్య పోరాటానికి పిలుపు : మెదక్ జిల్లా సీఐటీయూ జిల్లా మహాసభలో.. రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
నవతెలంగాణ-రామాయంపేట
”శ్రమ దోపిడీ అంతం, సీఐటీయూ పంతం” అనే నినాదంతో కార్మికుల హక్కుల కోసం సీఐటీయూ నిరంతరం పోరాడుతుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు తెలిపారు. సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలే ఏకైక మార్గమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివక్షపూరిత విధానాలను ఎదిరించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. శనివారం మెదక్ జిల్లా రామాయంపేటలోని మెహర్ సాయి ఫంక్షన్ హాల్లో జరిగిన సీఐటీయూ 15వ మహాసభలో ఆయన మాట్లాడారు. కార్మికులు కట్టుబానిసలు కాదని, దేశ సంపదను సృష్టించే కష్టజీవులని అన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం 29 రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి వారి బతుకులకు ఉరితాడు బిగించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక లోకం సన్నద్ధమవుతోందని తెలిరు. దేశంలో మత విభజనతో కాలం వెళ్లదీసే పరిస్థితి నెలకొన్నదని, 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చి, మనుధర్మ శాస్త్రాన్ని ముందుకు తెచ్చే ఆలోచన బీజేపీ ప్రభుత్వం చేసిందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ పెట్టుబడిదారులపై పక్షపాతంతో అసంఘటిత కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమాత్రం తగ్గకుండా.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నదని అన్నారు. కార్మికులు పనులు ఆపితే ఉత్పత్తి తగ్గి ప్రభుత్వ ఆదాయం కుంటుపడుతుందని, అయినా వారి కష్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం అప్రజాస్వామిక చర్యగా ఖండించారు. నేడు జరిగే ర్యాలీ, బహిరంగసభలో కార్మికులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్, జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు బాలమణి, ఎ. మల్లేశం, కె. నర్సమ్మ, సహాయ కార్యదర్శులు సంతోష్, కె.మల్లేశం పలు రంగాల కార్మికులు పాల్గొన్నారు.
శ్రమదోపిడీ అంతం.. సీఐటీయూ పంతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES