– విజయవంతం చేద్దాం : కేయూ వీసీ ప్రతాపరెడ్డి
నవతెలంగాణ – హనుమకొండ చౌరస్తా
ఆగస్టు 19 నుంచి 21 వరకు నిర్వహించే ప్రతిష్టాత్మక ‘తెలంగాణ సైన్స్ కాంగ్రెస్- 2025’ను విజయవంతం చేద్దామని కేయూ(కాకతీయ విశ్వవిద్యాలయం) వైస్ ఛాన్స్లర్ ఆచార్య కెప్రతాప్రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మానేజ్మెంట్ కళాశాల సెమినార్ హాల్లో సోమవారం విలేకర్ల సమావేశంలో వీసీ మాట్లాడారు. గోల్డెన్ జూబ్లీ ప్రారంభ సంవత్సరం సందర్భంగా ఇదే కాకతీయ యూనివర్సిటీలో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించుకోవడం గర్వకారణమన్నారు. మూడ్రోజుల సైన్స్ కాంగ్రెస్ ప్రారంభ సమావేశానికి భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి.సతీష్రెడ్డి హాజరుకానున్నారని తెలిపారు. 626మంది పేర్లు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. ఇంకా పలువురు స్పాట్ రిజిస్ట్రేషన్ ద్వారా పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. ఈ ప్రతిష్టాత్మక సైన్సు కాంగ్రెస్లో రెండు ప్లీనరీ సెషన్లు, వాటిలో ఐదు విస్తృత ఉపన్యాసాలు ఉంటాయన్నారు. ఐదు థీమాటిక్ ఇంటివైటెడ్ టాక్స్లో మొత్తం 65 ఉపన్యాసాలు ఉంటాయని, జాతీయస్థాయి శాస్త్రవేత్తలు, పలు సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నట్టు చెప్పారు. ఎంపిక చేసిన 16మంది లెక్చరర్లు ప్రత్యేక అంశాలపై ప్రసంగించనున్నట్టు చెప్పారు. విద్యార్థుల కోసం ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్లు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం శాస్త్రవేత్తలతో ముఖాముఖీ చర్చలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అలాగే సైంటిఫిక్ ఎగ్జిబిషన్లు, పాఠశాలల సైన్స్ టీచర్ల కోసం ప్రత్యేక సెషన్లు, ఇస్రో, డీఆర్డీఓ శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహిస్తారని అన్నారు. అక్టోబర్లో యూనివర్సిటీ కే-హబ్, రాష్ట్ర టీ-హబ్ కలిసి గోల్డెన్ జూబ్లీ కిక్స్టార్ట్ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి, నిర్మాణాలు, కొత్త ప్రాజెక్టులపై ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆచార్య బి.వెంకట్రామరెడ్డి, తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షులు ఆచార్య సీహెచ్ మోహన్రావు, కార్యదర్శి ఆచార్య ఎస్.సత్యనారాయణ, ట్రెజరర్ ఆచార్య ఎస్ఎం రెడ్డి, తెలంగాణ సైన్సు కాంగ్రెస్ -2025 కమిటీల సభ్యులు పాల్గొన్నారు.
ఆగస్టు 19 నుంచి తెలంగాణ సైన్స్ కాంగ్రెస్-2025
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES