రైతులకు అందించాల్సిన రైతుబంధు వెంటనే విడుదల చేయాలీ..
మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే డిమాండ్
నవతెలంగాణ – మద్నూర్
గత కొంతకాలంగా కురుస్తున్న భారీ వర్షాలకు జుక్కల్ నియోజకవర్గ వ్యాప్తంగా దెబ్బతిన్న పంటలకు వెంటనే పంట నష్టం అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట నష్టం అందించాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే డిమాండ్ చేశారు. గురువారం డోంగ్లి మండలంలోని పలు గ్రామాలలో పర్యటించి దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు పంట పెట్టుబడి సాయంగా రైతుబంధును అందించేవారని తెలిపారు. 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాయ ప్రజలకు మాటలు చెప్పి గద్దె నెక్కి రైతులను విస్మరించిందని మండిపడ్డారు.
రైతులకు అందించాల్సిన రైతుబంధును నాలుగు సీజన్లకు గాను ప్రతి ఎకరాకు రూ.30 వేలు అందించాల్సి ఉండగా రూ.11 వేల రూపాయలని అందించిందని అన్నారు. మిగతా ప్రతి ఎకరాకు రూ.19వేలు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని, రుణపడి ఉన్న రైతుబంధు మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయడంతో పాటు వర్షాల వల్ల దెబ్బతిన్న పంట నష్టపరిహారాన్ని కూడా వెంటనే రైతులకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే వెంటా మద్నూర్ మండలం బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్ ప్రధాన కార్యదర్శి గోవింద్ పటేల్ మద్నూర్ మాజీ సింగిల్ విండో చైర్మన్ విజయ్ కుమార్ మద్నూర్ మాజీ సర్పంచ్ సురేష్ మద్నూర్ మండలాల్లోని పార్టీ నాయకులు మాజీ సర్పంచులు ఎంపిటిసిలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, పంట నష్టపోయిన రైతులు పాల్గొన్నారు.
అధికారులకు ధన్యవాదాలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే
గత నాలుగు రోజుల క్రితం కురిసిన నియోజకవర్గంలోని నిజాంసాగర్, కౌలాస్ నాలా ప్రాజెక్టు లలో ఎగువ భాగం నుండి వరద నీరు వచ్చి చేరడంతో నిజాంసాగర్, కౌలాస్నాల వరద గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో బిచ్కుంద మండలంలోని షట్లూరు గ్రామంలో ముగ్గురు గొర్రెల కాపరులు, ఒక రైతు తో పాటు 656 గొర్రెలను ప్రాణాలతో పాటు రక్షించిన అధికారులకు, రెస్క్యూ టీం సభ్యులకి ధన్యవాదాలు తెలిపారు.