– జూబ్లీ ఎన్క్లేవ్లో ఆక్రమణల తొలగింపు
– పార్కులతోపాటు రహదారులకు రక్షణ
– దాదాపు 16000 గజాల స్థలానికి భద్రత
నవతెలంగాణ-సిటీబ్యూరో
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మాదాపూర్ ప్రాంతంలోని జూబ్లీ ఎన్క్లేవ్లో పార్కులతోపాటు రహదారుల ఆక్రమణలను గురువారం హైడ్రా తొలగించింది. 22.20 ఎకరాల్లో దాదాపు 100 ప్లాట్లతో అనుమతి పొందిన ఈ లేఔట్లో 4 పార్కులుండగా 2 కబ్జా(దాదాపు 8 వేల 500 గజాలు)కు గురయ్యాయి. అలాగే, 5 వేల గజాల మేర రోడ్డు కూడా కబ్జా అయ్యింది. వీటికి తోడు.. దాదాపు 300 గజాల ప్రభుత్వ స్థలంలో అక్రమంగా వెలిసిన హౌటల్ షెడ్డును హైడ్రా తొలగించింది. ఇలా మొత్తం 16000 గజాల స్థలాన్ని హైడ్రా కాపాడింది. దీని విలువ దాదాపు రూ.400 కోట్ల వరకు ఉంటుందని అంచనా. 1995లో అనుమతి పొందిన ఈ లేఔట్ను 2006లో ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. ఈ లేఔట్ ప్రకారం.. జీహెచ్ఎంసీకి గిఫ్ట్ డీడ్ చేసిన పార్కులను జైహింద్రెడ్డి అనే వ్యక్తి కబ్జా చేశారంటూ జూబ్లీ ఎన్క్లేవ్ లేఔట్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై క్షేత్రస్థాయిలో విచారించిన హైడ్రా అధికారులు కబ్జాలు వాస్తవమే అని నిర్ధారించుకున్నారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు వాటిని గురువారం తొలగించారు. హైడ్రా ఏసీపీ శ్రీకాంత్, ఇన్స్పెక్టర్లు రాజశేఖర్, బాలగోపాల్ నేతృత్వంలో ఈ కూల్చివేతలు జరిగాయి. వెనువెంటనే పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడినట్టు సూచిస్తూ బోర్డులు కూడా పెట్టారు. పార్కులు, ప్రభుత్వ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. కబ్జాకు పాల్పడ్డవారిపై పోలీస్ కేసులు పెడుతున్నట్టు అధికారులు తెలిపారు.
నాలుగు చోట్ల ఆక్రమణల తొలగింపు..
లేఔట్ ప్రకారం ఉన్న నాలుగు పార్కుల్లో 2 పార్కులు, రహదారి, ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైనట్టు వెల్లడి కావడంతో గురువారం హైడ్రా చర్యలు తీసుకుంది. హైటెక్ సిటీ నుంచి కొండాపూర్ రహదారికి ఆనుకొని మెటల్ చార్మినార్కు ఎదురుగా దాదాపు 300గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి.. అనుమతి లేకుండా హౌటల్ నిర్మించి అద్దెలను జైహింద్రెడ్డి పొందుతున్నాడని.. అదే స్థలంలో భారీ ప్రకటనల హౌర్డింగ్ కూడా పెట్టి రెండింటి ద్వారా నెలకు రూ.4 లక్షల వరకూ ఆదాయం పొందుతున్నాడని జూబ్లీ ఎన్క్లేవ్ ప్రతినిధులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలంలో హౌటల్ను నిర్మించి అద్దె వసూలు చేస్తున్న వైనంపై గతంలో జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 2006లో రెగ్యులరైజ్ అయిన లే ఔట్ అక్కడి ప్లాట్ యజమానులకు తెలవకుండా తర్వాత ఎలా రద్దౌతుందని వాపోయారు. యూఎల్సీ ల్యాండ్ అయితే ప్రభుత్వానికి చెందుతుందని.. మధ్యలో జైహింద్రెడ్డిది ఎలా అవుతుందని ఎన్క్లేవ్ ప్రతినిధులు ఫిర్యాదులో పేర్కొన్నారు. జైహింద్రెడ్డిపై చాలావరకు ల్యాండ్ గ్రాబింగ్ కేసులున్నాయని.. ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. పార్కులను కాపాడిన హైడ్రాకు కృతజ్ఞతలు తెలిపారు. చుట్టూ ఐటీ కార్యాలయాలు, నివాసాలు ఉన్న ప్రాంతంలో పార్కులను కాపాడి.. ఇక్కడి వారికి హైడ్రా ఊపిరి అందించిందని పేర్కొన్నారు. హైడ్రాను ఏర్పాటు చేసిన సీఎం రేవంత్రెడ్డితో పాటు.. ప్రభుత్వ భూములు, పార్కులు, చెరువులు, నాలాలను కాపాడుతున్న హైడ్రా ఉద్యోగులను వారిని ముందుండి నడిపిస్తున్న కమిషనర్కు ధన్యవాదాలు తెలిపారు.
రూ. 400 కోట్ల ఆస్తిని కాపాడిన హైడ్రా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES