- తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి బాధితురాలు
నవతెలంగాణ-మధిర: కుటుంబ కలహాలతో భార్యపై ఆగ్రహానికి గురైన భర్త మారణాయుధంతో ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన మండల పరిధిలోని మాటూరు గ్రామం బీసీ కాలనీలో జరిగింది. శనివారం అర్ధరాత్రి జరిగినట్లుగా తెలుస్తున్న ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చిల్లసూర్యనారాయణ ప్రైవేట్ లారీ డ్రైవర్ గా పనిచేస్తూ జీవన సాగిస్తున్నారు. అరకొర ఆర్థిక సమస్యలు కుటుంబ భారంతో భార్యాభర్తల మధ్య నెలకొన్న మనస్పర్ధలు నేపథ్యంలో శనివారం డ్రైవర్ విధులకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన భర్త సూర్యనారాయణ(32) భార్య సాయి నాగలక్ష్మి(26) తో ఘర్షణపడ్డారు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన సూర్యనారాయణ మారణాయుధంతో భార్యపై దాడి చేయగా, ఈ దాడిలో నాగలక్ష్మి మెడపై బలమైన ఘాట్లు పడి రక్తస్రావం కావడంతో బాధితురాలు కేకలు వేసుకుంటూ ఇంట్లో నుండి రోడ్డుపైకి వచ్చి కింద పడిపోయింది. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్ సహాయంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బలమైన గాయం తో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సంఘటన జరిగిన సమాచారాన్ని తెలుసుకున్న మధిర రూరల్ ఎస్సై లక్ష్మీ భార్గవి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా,
సూర్యనారాయణ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు ఉండగా ప్రస్తుతం నాగలక్ష్మి గర్భవతిగా ఉన్నట్లు సమాచారం. బాధితురాలు అమాయకురాలు గా అణుకువగా ఉంటుందని, సూర్యనారాయణ ఆమెపై గతంలో కూడా దాడి చేసి కొట్టినట్లు నమోదైన కేసు పోలీస్ రికార్డుల్లో ఉన్నట్లు ఈ సంఘటన అనంతరం గ్రామంలో పలు విధాలుగా చర్చించుకోవడం గమనార్హం.