VIPSకళాశాల ప్రిన్సిపాల్ కు తెలంగాణ మానవ హక్కుల సంఘం నోటీసులు
నవతెలంగాణ– నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, నల్గొండ విద్యాసంస్థలోని తొమ్మిది మంది బి.ఫార్మసీ విద్యార్థులు. కళాశాల యాజమాన్యం ప్రభుత్వం నుండి ఫీజు రీయింబర్స్మెంట్ రావలసి ఉందనే కారణంతో వారి ఒరిజినల్ స్టడీ సర్టిఫికెట్లు అక్రమంగా నిలిపివేస్తున్నారని తెలంగాణ మానవ హక్కుల సంఘంకు గురువారం ఆశ్రయించారు. ఫిర్యాదుపై వెంటనే స్పందించిన. మానవ హక్కుల సంఘం ఛైర్పర్సన్ డా. జస్టిస్ షమీమ్ అక్తర్, బి.ఫార్మసీ విద్యార్థులు దాఖలు చేసిన ఫిర్యాదుపై (హెచ్ఆర్సి నెంబర్. 4897 – 2025) విచారణ చేపట్టింది.
స్టడీ సర్టిఫికెట్లను నిలిపివేయడం విద్యార్థుల రాజ్యాంగ, మానవ హక్కులను ఉల్లంఘించేదని పేర్కొంటూ, మానవ హక్కుల రక్షణ చట్టం, 1993 లోని సెక్షన్ 18(c) కింద ఉన్న అధికారాలను వినియోగించి, సంబంధిత కళాశాల చైర్మన్ , ప్రిన్సిపాల్ తక్షణమే విద్యార్థుల ఒరిజినల్ స్టడీ సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వడమే కాక, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు (టి సిలు) జారీ చేయాలని కమిషన్ సిఫార్సు చేసింది. అలాగే, కళాశాల చైర్మన్ , ప్రిన్సిపాల్ వారలను వ్యక్తిగతంగా సెప్టెంబర్ రెండో తేదీన కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశిస్తూ, ఈ ఉత్తర్వుల ప్రతిని నల్గొండ జిల్లా కలెక్టర్కు , తెలంగాణ ఉన్నత విద్యా మండలికి తక్షణ చర్య కోసం పంపించింది.