– విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలి
నవతెలంగాణ – కామారెడ్డి
విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన బంద్ కామారెడ్డిలో విజయవంతమైంది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు జి.సురేష్, అరుణ్, జబ్బర్, శివ, విటల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేల క్లస్టర్ పాఠశాలలుగా కుదించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ విద్యకు తగిన బడ్జెట్ కేటాయించి విద్యాసంస్థలను బలోపేతం చేయాలని కోరారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను భర్తీ చేయడంతో పాటు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులపై నియంత్రణ చట్టం తీసుకురావాలని, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల బలవంతపు అమ్మకాలను అరికట్టాలని డిమాండ్ చేశారు.
పెండింగ్లో ఉన్న రూ.7 వేల కోట్ల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, అల్పాహార పథకాలను అమలు చేయాలని, మధ్యాహ్న భోజన పథకానికి తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం విచారకరమని నాయకులు విమర్శించారు. విద్యారంగ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వంపై విద్యార్థులు ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు మణికంఠ, నితిన్, అనిల్, సాయినాథ్, పీడీఎస్యూ నాయకులు శ్రీకాంత్, సాయి, కృష్ణ, నవీన్, ఏఐఎస్ఎఫ్ నాయకులు సంపత్ తదితరులు పాల్గొన్నారు.



