బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు సిఐడి కేసులో ఎట్టకేలకు ఊరట లభించింది. గత 50 రోజులుగా జ్యుడిషియల్ కస్టడీలో ఉంటున్న జగన్మోహన్ రావుకు గురువారం తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం జస్టిస్ సుజన ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జగన్మోహన్ రావుపై సిఐడి ఐపీసీ 409 కింద చేసిన ఆరోపణలు చేయగా.. హెచ్సీఏ ప్రెసిడెంట్ పదవి పబ్లిక్ ఆఫీస్ పరిధిలోకి రాదని న్యాయవాది సిద్దార్థ్ రెడ్డి వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. దర్యాప్తు సంస్థ ఇప్పటికే సాక్షులను విచారించి, సంబంధిత పత్రాలను సేకరించింది. ఈ దశలో దర్యాప్తు ప్రక్రియను, సాక్షులను జగన్ ప్రభావితం చేయరనే విషయాన్ని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుని రూ. 1 లక్ష పూచికత్తు సహా పలు షరతులతో బెయిల్ మంజూరు చేసింది.