భూసేకరణకు రాష్ట్ర సర్కారు సిద్ధంగా ఉంది
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అలైన్మెంట్ ఉండాలి : సమీక్షలో సీఎం ఎ.రేవంత్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, లైన్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైన నిధులను సమకూర్చటంతో పాటు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని నొక్కి చెప్పారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల అలైన్మెంట్లు ఉండాలనీ, దూరాభా రం తగ్గించి, అంచనా ఖర్చును కూడా తగ్గించుకోవాలని సూచించారు. ప్రయాణికులకు వేగవంతమైన రవాణా సదుపాయాలు అందించటంతో పాటు కొత్తగా వేసే రైలు మార్గాలన్నీ ఆయా ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడేలా ఉండాలని ఆకాంక్షించారు. ప్రధానంగా పర్యాటక కేంద్రాలు, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. విదేశాల తరహాలో రైలు, రోడ్డు, పోర్ట్ కనెక్టివిటీని అధునాతనంగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. రైల్వే పెండింగ్, ప్రతిపాదిత ప్రాజెక్టులపై సీఎం రేవంత్రెడ్డి గురువారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో దక్షిణ మధ్య రైల్వే అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజరుకుమార్ శ్రీవాస్తవ, ఎంపీ కడియం కావ్య, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్అండ్బీ ప్రత్యేక కార్యదర్శి వికాస్రాజ్, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కొత్త రైల్వే ప్రాజెక్టులపై సంజరుకుమార్ శ్రీవాస్తవతో సీఎం చర్చించారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు అనుసంధానంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీ ప్రకారం హైదరాబాద్ నుంచి అమరావతికి ర్యాపిడ్ రైల్ అండ్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టును కేంద్రం అమలు చేయాల్సి ఉందని గుర్తుచేశారు. కొత్తగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ వరకు 12 లైన్ల గ్రీన్ఫీల్డ్ హైవే ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామనీ, అందుకు సంబంధించి 300 కిలోమీటర్ల అలైన్మెంట్ ప్రతిపాదనలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిందని వివరించారు. దానికి అనుగుణంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలనీ, రైల్వే విభాగం పరిశీలనలో ఉన్న అలైన్మెంట్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన అలైన్మెంట్ను కూడా పరిశీలించి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ముందుకెళ్లాలని సూచించారు.
హైవే వెంట రైలుమార్గం ఉండాలనీ, హైవేకు ఇరువైపులా కిలోమీటర్న్నర దూరం వరకు ఇండిస్టీయల్ కారిడార్ను విస్తరించాలనే ప్రతిపాదనలున్నాయని ప్రస్తావించారు. కొత్తగా అభివృద్ధి చేస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే ప్రతిపాదనలకు అనుగుణంగా హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగుళూరు హైస్పీడ్ రైలు ప్రాజెక్టుల సర్వే, అలైన్మెంట్ ప్రతిపాదనలను మరోసారి పరిశీలించాలని ముఖ్యమంత్రి రైల్వే అధికారులకు సూచించారు. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రైల్ ఆవశ్యకతను సీఎం అధికారులకు వివరించారు. దాదాపు 362 కిలోమీటర్ల మేరకు రీజనల్ రింగ్ రోడ్డు వెంట రింగ్ రైలు ఏర్పాటు చేయటంతో హైదరాబాద్ మహానగరం భవిష్యత్తు స్వరూపం మారిపోతుంద న్నారు. వీలైనంత తొందరగా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రైల్వే అధికారులకు సీఎం సూచించారు. తెలంగాణ ఇండిస్టీయల్ సెక్టార్ కోసం ప్రత్యేక రైల్వే లైన్ ఉండేలా ఈ కనెక్టివిటీ ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. వికారాబాద్- కృష్ణా కొత్త రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని సూచించారు. దీంతో పాటు గద్వాల-డోర్నకల్ రైల్వే లైన్ పనుల డీపీఆర్ పూర్తి చేసి వేగంగా చేపట్టాలని ఆదేశించారు. వరంగల్లోనూ రైల్వే లైన్లను అభివృద్ధి చేయాలనీ, భూపాలపల్లి నుంచి వరంగల్ కొత్త మార్గాన్ని పరిశీలించాలని సూచించారు. కాజీపేట జంక్షన్లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్తో పాటు వరంగల్ను అభివృద్ధి చేయాలనీ, అందుకు అనుగుణంగా రైల్వే ప్రాజెక్టులను చేపట్టాలని రైల్వే అధికారులకు సీఎం రేవంత్రెడ్డి సూచించారు.
రైల్వే ప్రాజెక్టులకు సహకరిస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES