నవతెలంగాణ-హైదరాబాద్: నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధం విధిస్తూ ఆ దేశ పార్లమెంట్ తీసుకున్న నిర్ణయంపై జెన్ జెడ్ చేపట్టిన నిరసనలు బీభత్సవం సృష్టించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో పలువురు మరణించారు. తాజాగా మృతుల సంఖ్య 51కి పెరిగింది. వారిలో 30 మంది బుల్లెట్ గాయాల తో మరణించిన వారు ఉన్నారు. మిగతా 21 మంది మంటలు అంటుకుని, ఇతర గాయాలతో మరణించారు. మృతుల్లో పౌరులతోపాటు పోలీసులు కూడా ఉన్నారు. నేపాల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం మధ్యాహ్నం ఈ వివరాలను వెల్లడించింది.
కాగా, నేపాల్ రాజధాని ఖాట్మండులో మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయ్యింది. దాంతో కుటుంబసభ్యులకు మృతదేహాలను అప్పగించే కార్యక్రమం మొదలైంది. ఈ క్రమంలో ఆస్పత్రి పరిసరాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. కాగా వందల మంది గాయాలతో చికిత్స పొందుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.