నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమ బెంగాల్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఖరగ్పూర్ యూటర్న్ తీసుకున్నది. క్యాంపస్లోని హాస్టల్ డైనింగ్ హాల్లో వెజ్, నాన్-వెజ్ విద్యార్థులకు వేర్వేరుగా సీటింగ్ కోసం జారీ చేసిన నోటీసును రద్దు చేసింది. హాస్టల్ విద్యార్థులతోపాటు పూర్వ విద్యార్థుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గింది. ఆగస్ట్ 16న బీఆర్ అంబేద్కర్ డైనింగ్ హాల్లో శాఖాహారం, మాంసాహారం విద్యార్థుల కోసం విడిగా సీటింగ్ కేటాయించారు. విద్యార్థులు ఆ మేరకు ఆయా సీట్లలో కూర్చోవాలని నోటీస్ జారీ చేశారు.
మరోవైపు ఉన్నత అధికారులకు తెలియకుండా ఈ నోటీసు జారీ అయ్యిందని ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సుమన్ చక్రవర్తి తెలిపారు. దీని గురించి తెలిసిన వెంటనే ఉన్నతాధికారులను సంప్రదించి ఆ నోటీస్ను రద్దు చేసినట్లు చెప్పారు. విద్యాసంస్థలో ఆహార ప్రాధాన్యతల ఆధారంగా ఎలాంటి విభజన ఉండకూడదని ఆయన అన్నారు.