Saturday, September 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులకు 'వెయిటేజీ'

వర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులకు ‘వెయిటేజీ’

- Advertisement -

త్వరలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ
యూజీసీ నిబంధనలకు అనుగుణంగా 21 జీవో సవరణ
విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరి
తొలుత విశ్వవిద్యాలయాల్లో ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమలు
తర్వాత అనుబంధ కాలేజీల్లో వర్తింపజేస్తాం : వీసీల సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ బాలకిష్టారెడ్డి


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేస్తామని ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ వి బాలకిష్టారెడ్డి చెప్పారు. వర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు వెయిటేజీ కల్పించాలని నిర్ణయించామని అన్నారు. రాష్ట్రంలోని 12 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు సంబంధించి 2,817 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో 757 (26.87 శాతం) మంది ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. శుక్రవారం హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విశ్వవిద్యాలయాల ఉపకులపతుల (వీసీ)తో సమావేశాన్ని నిర్వహించారు. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మీడియాతో బాలకిష్టారెడ్డి మాట్లా డుతూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ నాలుగో తేదీన విడుదల చేసిన 21 జీవోపై కొన్ని అభ్యంతరాలు వచ్చాయని చెప్పారు. యూజీసీకి విరుద్ధంగా ఉందంటూ వినతిపత్రాలను అందజేశారని అన్నారు. కోర్టు లో కేసు వేస్తే ఆ జీవో నిలవబోదని స్పష్టం చేశారు.

యూజీసీ నిబంధనలకు అనుగునంగా జీవో 21ని సవరణ లు చేస్తామన్నారు. ఫేషియల్‌ రికగ్నిషన్‌ హాజరు (ఎఫ్‌ఆర్‌ఎస్‌) విధానం తొలుత విశ్వవిద్యాలయాల్లో అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటికే 80 నుంచి 90 శాతం ఎఫ్‌ఆర్‌ఎస్‌ లేదా బయోమెట్రిక్‌ వర్సిటీల్లో అమలవుతున్న దని వివరించారు. తర్వాత వర్సిటీల అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల్లో ఎఫ్‌ఆర్‌ఎస్‌ను అమలు చేస్తామని అన్నారు. విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అప్పుడే ఫీజు రీయింబర్స్‌ మెంట్‌కు అర్హులవుతారని చెప్పారు. ఇదే అంశాన్ని ప్రభుత్వం, కోర్టులు కూడా స్పష్టం చేశాయని గుర్తు చేశారు. విద్యార్థులకు సంబంధించి అపార్‌, డీజీలాకర్‌పై సమీక్షించా మని అన్నారు. విద్యారంగ సంస్కరణల గురించి చర్చించా మన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా డిగ్రీ సిలబస్‌ను రూపకల్పన చేశామని చెప్పారు. ఇంగ్లీష్‌ భాషలో విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయని వివరించారు.

పీజీ ప్రవేశాల్లో స్పోర్ట్స్‌ కోటా
పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి 0.5 శాతం స్పోర్ట్స్‌ కోటాను అమలు చేయాలని నిర్ణయించామని బాలకిష్టారెడ్డి చెప్పారు. క్రీడలకు, క్రీడాకారులకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారని అన్నారు. తెలంగాణ విద్యా విధానం (టీఈపీ) గురించి వీసీలకు వివరించానని చెప్పారు. తొలిసారిగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఈనెల 15 నుంచి స్పాట్‌ అడ్మిషన్లకు అవకాశం కల్పించామని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియో గించుకోవాలని కోరారు. అయితే స్పాట్‌లో ప్రవేశాలు పొందిన వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించబోదని స్పష్టం చేశారు. వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిం చిన ప్రవేశ పరీక్షలు (సెట్స్‌) విజయవంతమయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మెన్లు ఇటిక్యాల పురుషోత్తం, ఎస్‌కే మహమూద్‌, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్‌, వీసీలు టి యాదగిరిరావు, ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌, జిఎన్‌ శ్రీనివాస్‌, ఉమేష్‌ కుమార్‌, సూర్య ధనుంజరు, టి కిషన్‌ కుమార్‌ రెడ్డి, టి గంగాధర్‌, ఎ గోవర్ధన్‌, వి నిత్యానందరావు, ఘంటా చక్రపాణి, ఓయూ రిజిస్ట్రార్‌ నరేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -