మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు
సిద్దిపేటలో మెగా జాబ్మేళా
నవతెలంగాణ-సిద్దిపేట
‘పలానా మంత్రులు, అధికారులు లక్షల రూపాయలు లంచం అడిగారని ఓ వైపు నిరుద్యోగులు చెబుతుంటే, మరోవైపు గ్రూప్-1 పరీక్ష ఇంత నిర్లక్ష్యంగా నిర్వహిస్తారా అని స్వయంగా హైకోర్టు.. ప్రభుత్వంపై మొట్టికాయలు వేసింది.. నిజంగా తప్పు చేయకపోతే ముఖ్యమంత్రి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పంచిలో మెగా జాబ్మేళాను ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవినీతికి పాల్పడ్డ వారిని శిక్షించాలని కోరారు. తప్పు సరిదిద్దకుండా మరో అప్పీల్కి పోదామని చెప్పడం మూర్ఖత్వమని అన్నారు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని, రెండేండ్లు పూర్తవుతున్నా ఉద్యోగాలు ఏమయ్యాయని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తే చర్చ పెట్టకుండా జాబ్ క్యాలెండర్ అని పారిపోయారని తెలిపారు. హుస్నాబాద్ సభలో ప్రియాంక గాంధీతో చెప్పించిన నిరుద్యోగ యువతకు రూ.4 వేల నిరుద్యోగ భృతి సంగతి ఏమయిందని ప్రశ్నించారు. ప్రభుత్వం నిరుద్యోగ యువతని పూర్తిగా మోసం చేసిందని, మీ పక్షాన తాము అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలిపారు. చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే బాగుండు అనుకుంటారని, అలా అనుకోవడంలో తప్పులేదు కానీ జీవితంలో మొదటి అడుగు పడటం అనేది చాలా ముఖ్యమన్నారు. దాదాపు 30 కంపెనీలు మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఇక్కడికి వచ్చాయని తెలిపారు. ఉన్నత ఉద్యోగానికి, ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తూ ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, నిరుద్యోగులు పాల్గొన్నారు.