ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
200కు పైగా ఎంఎస్ఎంఈల ఉత్పత్తులు, సేవల ప్రదర్శన
దేశ, విదేశాల నుంచి సందర్శకులు
రెండ్రోజుల్లో 20 వేల మంది విచ్చేసే అవకాశం
నవతెలంగాణ-శంషాబాద్
ప్రపంచంలో అతిపెద్ద వ్యాపార నెట్వర్కింగ్, వ్యాపార రిపరల్ సంస్థ అయిన బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ (బీఎన్ఐ) ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ ఎస్ఎస్ కన్వెన్షన్లో ‘బీఎన్ఐ వాంటేజ్ గోనాట్ – 2025’ పేరుతో ఏర్పాటు చేశారు. ఆ ఎంఎస్ఎంఈ ఎక్స్పోను శనివారం పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. బీఎన్ఐ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగే ఈ ఈవెంట్లో పారిశ్రామికవేత్తలు, వ్యాపార దృక్పథం కలిగిన వ్యక్తులు హాజరవుతారు. ఈ గోనాట్-2025కు భారత్, మధ్య ప్రాచ్య దేశాలు, పొరుగు దేశాల నుంచి ఇరవై వేలకు పైగా సందర్శకులు రానున్నారు. 200 పైగా ఎంఎస్ఎంఈలు తమ విభిన్న ఉత్పత్తులు, సేవలను ప్రదర్శిస్తూ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద బీఎన్ఐ రీజియన్గా నిలిచిన బీఎన్ఐ హైదరాబాద్, 400 పైగా పరిశ్రమల్లో 4,000 పైగా వ్యాపార యజమానులను కలిగి ఉంది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎంఎస్ఎంఈ భవిష్యత్తు, దేశ నిర్మాణంలో వాటి పాత్ర, ఈ రంగాన్ని బలపరచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై డైనమిక్ ఫైర్సైడ్గా ఉంటుందన్నారు. బీఎన్ఐ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజనా షా మాట్లాడుతూ.. ఇది కేవలం ఒక ఎక్స్పో మాత్రమే కాదనీ, ఇది సహకారాలకు జన్మనిచ్చే, ఆలోచనలకు రెక్కలు విప్పే ఎకోసిస్టమని అన్నారు. సరైన అవకాశాలతో, పెద్ద కలలతో గ్లోబల్ స్టేజ్లో నిలబడే అవకాశాన్ని అందించడం తమ లక్ష్యమన్నారు. అనంతరం లీడ్ ఆర్ బ్లీడ్ పుస్తక రచయిత, క్వాంటమ్ లీప్ లెర్నింగ్ సొల్యూషన్స్ వ్యవస్థాపకులు రాజీవ్ తల్రేజా, జూహౌ కార్పొరేషన్ ఇంజినీరింగ్, బిజినెస్ సొల్యూషన్స్ డైరెక్టర్, జూహౌ స్కూల్ ఆఫ్ లెర్నింగ్ అధ్యక్షుడు రాజేంద్రన్ దండపాని, జెట్ సెట్గో ఏవియేషన్ సహ వ్యవస్థాపకురాలు, సీఈఓ కనికా తెక్రివాల్ తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో బేకింగ్, ఫొటోగ్రఫీ, ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్ స్టైలింగ్, అడ్వర్టైజింగ్, ఫుడ్ ఇన్నోవేషన్ వంటి విభాగాల్లో చాప్టర్ కాంటెస్టులు, వ్యక్తిగత పోటీలు సృజనాత్మకతతో సందడిగా సాగాయి. మొదటి రోజు అజీమ్ బనాత్వాలా స్టాండ్-అప్ కామెడీ ఆకట్టుకుంది.
ఉత్తమ ప్రతిభావంతులకు అవార్డ్స్ అందించారు. రీగల్ రెసిడెన్సెస్ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమానికి కో-స్పాన్సర్లు ఓపీపీఈఐఎన్, పోకర్ణా లిమిటెడ్, లియో పాకర్స్ అండ్ మూవర్స్ ప్రయివేట్ లిమిటెడ్ గోల్డ్ స్పాన్సర్గా ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఎన్ఐ హైదరాబాద్ ఏరియా డైరెక్టర్ టీ.సతీష్కుమార్, శ్రీఆదిత్య కెడియా రియల్టర్స్ ఎల్ఎల్పీ విష్ణు కుమార్ కెడియా, ఓపీపీఈఐఎన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అల్లూరి శ్రీనివాస్ రాజు, క్వాంట్రా క్వార్ట్జ్ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ చంద్ర జైన్, లియో పాకర్స్ అండ్ మూవర్స్ ప్రయివేట్ లిమిటెడ్ శ్రద్ధా షా తదితరులు పాల్గొన్నారు.