సాత్విక్-చిరాగ్, లక్ష్యసేన్ సిల్వర్ షో
హాంగ్కాంగ్ ఓపెన్ సూపర్ 300
హాంగ్కాంగ్ సిటీ : హాంగ్కాంగ్ ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్లో భారత షట్లర్లు సాత్విక్-చిరాగ్, లక్ష్యసేన్ రన్నరప్గా నిలిచారు. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టిలు రజత పతకం సాధించగా.. పురుషుల సింగిల్స్ విభాగంలో లక్ష్యసేన్ సిల్వర్ మెడల్ దక్కించుకున్నాడు. ఈ ఏడాది తొలిసారి ఫైనల్లో ఆడిన సాత్విక్ జోడీ, లక్ష్యసేన్లు పసిడి పతకానికి అడుగు దూరంలో ఆగిపోయారు. ఆదివారం జరిగిన మెన్స్ డబుల్స్ ఫైన్లలో వరల్డ్ నం.7 చైనా షట్లర్లు లియాంగ్ కెంగ్, వాంగ్ చెంగ్లు 19-21, 21-14, 21-17తో మూడు గేమ్ల మ్యాచ్లో సాత్విక్, చిరాగ్పై గెలుపొందారు. హౌరాహౌరీగా సాగిన తొలి గేమ్లో 19-19తో స్కోరు సమం కాగా.. వరుసగా రెండు పాయింట్లతో సాత్విక్, చిరాగ్లు పైచేయి సాధించారు. రెండో గేమ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. ఏ దశలోనూ సాత్విక్,చిరాగ్ జోడీ పోటీ ఇవ్వలేకపోయింది. నిర్ణయాత్మక మూడో గేమ్లోనూ చైనా షట్లర్లు ఉత్తమ ప్రదర్శన చేశారు. 2-11తో విరామ సమయానికే చేతులెత్తేసిన సాత్విక్, చిరాగ్లు ద్వితీయార్థంలోనూ పుంజుకోలేదు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో వరల్డ్ నం.4 చైనా షట్లర్ లీ షి ఫెంగ్ 21-15, 21-12తో లక్ష్యసేన్పై విజయం సాధించాడు. 45 నిమిషాల్లోనే ముగిసిన ఫైనల్లో.. తొలి గేమ్లో 10-10 వరకు పోటీనిచ్చిన లక్ష్యసేన్ ఆ తర్వాత వెనుకంజ వేశాడు. రెండో గేమ్లో 4-4 తర్వాత లక్ష్యసేన్పై ఆధిపత్యం చెలాయించిన లీ షి ఫెంగ్కు ఆ తర్వాత పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. డబుల్స్లో సాత్విక్, చిరాగ్లు.. సింగిల్స్లో లక్ష్యసేన్ రన్నరప్గా నిలిచి సిల్వర్ మెడల్స్ సొంతం చేసుకున్నారు.