శాంతికుమారి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జర్నలిజం అంటే కేవలం వృత్తి కాదనీ, అది మాటలు రాని వారి గొంతుక అని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ వైస్ చైర్పర్సన్, డైరెక్టర్ జనరల్ శాంతి కుమారి తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని సంస్థ ప్రాంగణంలో ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఆధ్వర్యంలో మీడియా మేనేజ్ మెంట్పై ఏర్పాటు చేసిన రెండు వారాల శిక్షణ కార్యక్రమంలో ఆమె ప్రారంభోపన్యాసం చేశారు. సమాజానికి కాపలాదారుగా ఉంటూ, ప్రభుత్వానికి, పౌరులకు వారధిగా నిలుస్తున్నదన్నారు. మొబైల్ జర్నలిజం, మల్టీమీడియా స్టోరీ టెల్లింగ్, సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ వంటి సాంకేతికత రాకతో సమాచార ఉత్పత్తి, వినియోగంలో మార్పులొచ్చాయని తెలిపారు. ఈ సాంకేతికత కొత్త అవకాశాలు తెచ్చిందనీ, అదే సమయంలో తప్పుడు సమాచార వ్యాప్తి, ప్రజా విశ్వసనీయతను పట్టించుకోకపోవడం, నైతికతను లెక్కచేయకపోవడం వంటి సమస్యలను కూడా మోసుకొచ్చిందని చెప్పారు. సెంటర్ ఫర్ లా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ హెడ్, ప్రొఫెసర్, కోర్స్ డైరెక్టర్ డాక్టర్ మాధవి రావులపాటి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా భాగస్వాముల మధ్య స్వేచ్ఛగా, నైతికంగా, బాధ్యాతాయుతంగా ప్రెస్ అనే విషయంపై అనుభవాలను పంచుకునేందుకు ఈ వేదిక ఉపయోగపడు తుందని తెలిపారు. శిక్షణా కార్యక్రమానికి ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా తదితర 25 దేశాల నుంచి 30 మంది ప్రతినిధులు హాజరయ్యారు.