22 నుంచి డెలివరీ చార్జీలపై 18శాతం జీఎస్టీ
న్యూఢిల్లీ : ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటో ఇప్పటికే భారీగా పెంచిన ఫ్లాట్ఫామ్ ధరలకు తోడు డెలివరీ సేవలు మరింత ప్రియం కానున్నాయి. ఇప్పటి వరకు ఫుడ్ డెలివరీపై 5 శాతం జీఎస్టీ అమల్లో ఉండ గా.. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ఇది 18 శాతానికి పెరగనుంది. డెలివరీ చార్జీలపై ఇకపై కొత్తగా విధించనున్న 18 శాతం జీఎస్టీతో జొమాటో వినియోగదారులపై ఆర్డరుకు రూ.2 చొప్పున, స్విగ్గీ కొనుగోలుదార్లపై రూ.2.6 చొప్పున భారం పడే అవకాశం ఉంది. ఈ భారాన్ని వినియోగదారులపై వేయడానికి ఫుడ్ డెలివరీ సంస్థలు సన్నద్దం అవుతోన్నాయి. ఒకప్పుడు ఈ సంస్థలు డెలివరీ చార్జీ మాత్రమే వసూలు చేసేవి. బాగా వాడుకలోకి వచ్చిన తర్వాత లాభాలను పెంచుకునేందుకు 2022లో రూ.2 ఫ్లాట్ఫామ్ ఫీజును వసూలు చేయడం ప్రారంభించాయి. క్రమంగా దీన్ని జొమాటో రూ.12.50కు, స్విగ్గీ రూ.15కు చేర్చింది. దీంతో ఆన్లైన్ అహారం మరింత ప్రియం అయ్యింది.