ఆలయ ఈఓ అంజనదేవి
నవతెలంగాణ – ముధోల్
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చదువుల తల్లి కొలువైన బాసర శ్రీజ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఆలయం లో శారదియా నవరాత్రి ఉత్సవాలకు విస్తృత ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈవో అంజనదేవి తెలిపారు. శనివారం ఆలయ ఈవో అంజనాదేవి, ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 22 సోమవారం నుండి అక్టోబర్ 2వ తేది వరకు ఉత్సవాలు కొనసాగుతాయని అన్నారు. ఈ తొమ్మిది రోజులపాటు అమ్మవారు తొమ్మిది రూపాలలో భక్తులకు అమ్మవారు దర్శనం ఇవ్వనున్నట్లు ఆలయ స్థానాచార్యులు, ప్రధానో అర్చకులు తెలిపారు.
ఈ తొమ్మిది రోజులపాటు అమ్మవారి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈనెల 29న అమ్మవారి జన్మ నక్షత్రం అయిన మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్న దృష్ట్యా సాధారణ ప్రత్యేక అక్షరాభ్యాస పూజల క్యూ లైన్, సర్వదర్శన ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మూల నక్షత్రం సందర్భంగా భక్తులకు చిన్నారులకు ఉచితంగా పాలు బిస్కెట్లు అరటిపండు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంతో పాటు ఉపాఆలయాలను విద్యుత్ దీపాలు, వివిధ రకాల పూవ్వులతో అలంకరణ చేయనున్నట్లు చెప్పారు. భక్తులకు ప్రత్యేకంగా క్యూలైన్లో త్రాగునీరు వసతి కల్పింస్తామని చెప్పారు.
ఆలయ ప్రాంగణంలో వైద్య శిబిరం, బయో టాయిలెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. నవరాత్రుల్లో భక్తుల కోసం సాంస్కృతి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామన్నారు. గోదావరి నది తీరం వద్ద పుణ్య స్నానాలకు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా అందుబాటులో గజ ఈత గాళ్ళు అందుబాటులో ఉంటారని అన్నారు . పోలీసులు ,స్వచ్ఛంద సేవ సంస్థల ఆధ్వర్యంలో భక్తులకు సేవలు అందించనున్నారని తెలిపారు. సమావేశంలో ఆలయ ఏ ఈ ఓ సుదర్శన్ గౌడ్, సూపరింటెండెంట్ శివరాజ్, సిబ్బంది పాల్గొన్నారు.