తహసిల్దార్ నాగేశ్వర చారి
నవతెలంగాణ – పాలకుర్తి
భూముల పట్టాల కోసం రైతులు చేసుకున్న సాదా బైనామాల దరఖాస్తులను రేపటి నుండి గ్రామాల వారిగా పరిశీలిస్తామని తహసిల్దార్ నాగేశ్వర చారి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. 2020 అక్టోబర్ 12 నుండి డిసెంబర్ 10 వరకు సాదా బైనామాల కోసం దరఖాస్తులు చేసుకున్న రైతుల దరఖాస్తులను మాత్రమే పరిశీలిస్తామని తెలిపారు. 4678 మంది రైతుల నుండి దరఖాస్తులు అందాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సాదాబైనామాల సదుపాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను పరిశీలించేందుకు రెవిన్యూ అధికారులు వస్తారని తెలిపారు.
ఈనెల 25న గురువారం చెన్నూరు, అయ్యంగారిపల్లి, బొమ్మెర,26న శుక్రవారం వావిలాల, ఈరవెన్ను, తిర్మలగిరి, 27న శనివారం మంచుప్పుల ,కోతులాబాద్, మల్లెంపల్లె, 29న సోమవారం గూడూరు, లక్ష్మినారాయణపురం, విస్నూర్, 30న మంగళవారం దర్దేపల్లి, మైలారం, శాతపురం, అక్టోబర్ 4న శనివారం ముత్తారం ,తీగారం, తొర్రూర్, అక్టోబర్ 6న సోమవారంపాలకుర్తి , కొండాపురం, వల్మిడి గ్రామాల్లో పరిశీలించడం జరుగుతుందని తెలిపారు.
దరఖాస్తులు చేసుకున్న రైతులకు చెందిన భూమి వివరాలను పరిశీలించి అమ్మిన వ్యక్తులతో పాటు కొన్న వ్యక్తులకు నోటీసులను అందజేస్తామని తెలిపారు. సాదా బైనమాల విధానం పట్టా భూములకు మాత్రమే వర్తిస్తుందని, కోర్టుల పరిధిలో ఉన్న భూములపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములు సదాబై నామ దరఖాస్తులకు వర్తించవని వివరించారు. అమ్మిన వ్యక్తికి తెలియకుండా రికార్డులను మార్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండబోదనే స్పష్టం చేశారు. సాదాబైనామాల దరఖాస్తుల పరిశీలనకు రైతులు సహకరించాలని సూచించారు.