ఎర్రబెల్లి సంపత్ రావు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు
నవతెలంగాణ – జమ్మికుంట
హుజురాబాద్ ప్రభుత్వ దవాఖానలో సూపర్వైజర్, పేషంట్ కేర్,సెక్యూరిటీ గార్డ్, ఇతరాత్ర పనులు చేయడానికి ప్రభుత్వం వద్ద కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టర్ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అర్హత లేనటువంటి వ్యక్తులను వేల రూపాయలు వారి వద్ద తీసుకుని ఉద్యోగంలో పెట్టుకోవడం జరిగిందని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు సంపత్ రావు ఆరోపించారు.
దాని కారణంగా హాస్పిటల్ కు వచ్చే రోగులను సరిగ్గా పట్టించుకోకపోవడమే కాకుండా, వారిని భయబ్రాంతులకు గురిచేస్తూ, ఇక్కడ సరైన చికిత్స జరగదని మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్ళండి అని వరంగల్, హాన్మకొండ,కరీంనగర్, జమ్మికుంట లాంటి ప్రాంతాలకు పంపించి, పేద ప్రజలను ఘోరంగా మోసం చేశారని సంపత్ రావు ఆరోపించారు. ప్రైవేట్ హాస్పటల్స్ తో కుమ్మకై లక్షల రూపాయలు కమిషన్ తీసుకొని, రోగులకు తీవ్ర నష్టం చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగుల పైన ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లడంతో, జిల్లా కలెక్టర్ దీనిపైన విచారణ జరిపి అక్రమాలు జరిగాయని నిర్ధారణ కావడంతో, సుమారు 20మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించి, చేతులు దులుపుకున్నారని సంపత్ రావు తెలిపారు.
కానీ ఎలాంటి అర్హత లేకున్నా వేల రూపాయలు తీసుకొని ఉద్యోగం ఇచ్చిన హాస్పిటల్ కాంట్రాక్టర్ పైన చైర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి పేద ప్రజలను (రోగులను) నిండా ముంచడానికి కారణమైన కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకొని, అతని కాంట్రాక్ట్ రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.