ఆసీస్-ఏపై సిరీస్ కైవసం
లక్నో: కేఎల్ రాహుల్ (210 బంతుల్లో 176 నాటౌట్, 16 ఫోర్లు, 4 సిక్స్లు) అజేయ శతకం, సాయి సుదర్శన్ (100) సెంచరీతో కదం తొక్కడంతో ఆస్ట్రేలియా-ఏతో జరిగిన రెండో అనధికారిక టెస్టులో భారత్ -ఏ రికార్డు విజయాన్ని అందుకుంది. 413 పరుగుల ఛేదనలో.. ఓవర్నైట్ స్కోరు 169/2తో నాలుగో రోజు ఆట ఆరంభించిన భారత్-ఏ 91.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. సాయి సుదర్శన్ నిష్క్రమించినా.. కెప్టెన్ ధ్రువ్ జురెల్ (56), నితీశ్ రెడ్డి (16 నాటౌట్)తో కలిసి రాహుల్ గెలుపు లాంఛనాన్ని పూర్తిచేశాడు. కాగా భారత్లో ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇది ఆరో అత్యధిక చేధన. ఈ విజయంతో రెండు మ్యాచ్ల సిరీస్ను భారత్ 1-0తో గెలుచుకుంది. ఈనెల 30 నుంచి భారత్, ఆసీస్ – ఏ జట్ల వన్డే సిరీస్ ఆరంభం కానుంది.