కాంగ్రెస్, బీజేపీలకు ఇష్టంలేదు
9వ షెడ్యూల్లో చేరిస్తేనే చట్టబద్ధత
ఆ దిశగా చేసే ప్రయత్నాలకు బీఆర్ఎస్ సహకారం : మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కకుండా కాంగ్రెస్, బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేరిస్తేనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత లభిస్తుందనీ, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు బీఆర్ఎస్ సహకరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. మంగళ వారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవో తెస్తే రిజర్వేషన్ల పెంపు అమలయ్యేలా ఉంటే అసెంబ్లీలో ఏక గ్రీవ తీర్మానం ఎందుకు, బిల్లు గవర్నర్, రాష్ట్రపతి దగ్గరకు ఎందుకు? అని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలు ఇలాంటి జీవోలు తెస్తే కోర్టులు కొట్టేసిన విషయం తెలిసే బీసీలను మోసం చేసి జీవో తెచ్చారని ఆయన దుయ్యబట్టారు. మహారాష్ట్రలో జీవో ద్వారా రిజర్వేషన్లు పెంచి నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికలను సుప్రీంకోర్టు కొట్టేసిం దని గుర్తు చేశారు. తెలంగాణ లోనూ ఆ పరిస్థితి వస్తే దానికి బాధ్యులెవరని ప్రశ్నించారు. క్యాబినెట్లో, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.