నేటి నుంచి ప్రైమ్ వాలీబాల్ లీగ్
ఆరంభ పోరులో కాలికట్తో హైదరాబాద్ బ్లాక్హాక్స్ ఢీ
హైదరాబాద్: వాలీబాల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్కు రంగం సిద్ధమైంది. పది జట్లు బరిలో నిలిచిన ఈ మెగా లీగ్ హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా గురువారం నుంచి సందడి చేయనుంది. తొలి రోజు ఆతిథ్య హైదరాబాద్ బ్లాక్ హాక్స్, డిఫెండింగ్ చాంపియన్ కాలికట్ హీరోస్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్తో టోర్నమెంట్ ప్రారంభం కానుంది. సొంత గడ్డపై బరిలోకి దిగుతున్న హైదరాబాద్ బ్లాక్ హాక్స్కు బ్రెజిల్ ఆటగాడు పాలో లమౌనీర్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా, పటిష్టమైన కాలికట్ హీరోస్కు అనుభవజ్ఞుడైన మోహన్ ఉక్రపాండియన్ నాయకత్వం వహిస్తున్నాడు.
బుధవారం హైదరాబాద్లో నిర్వాహకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లీగ్ సహ-వ్యవస్థాపకుడు బేస్లైన్ వెంచర్స్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ తుహిన్ మిశ్రా, లీగ్ సీఈఓ జాయ్ భట్టాచార్య, టైటిల్ స్పాన్సర్ – ఆర్ ఆర్ కేబుల్ గ్లోబల్ డైరెక్టర్ కీర్తి కాబ్రా, ఆర్ఆర్ కేబుల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శిశిర్ శర్మ, స్కాపియా వ్యవస్థాపకుడు అనిల్ గోటేటి తో పాటు పది ఫ్రాంచైజీల కెప్టెన్లు హాజరయ్యారు.