ఆర్ఎస్ఎస్పై పోస్టల్ స్టాంప్ విడుదలను ఖండించిన సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్ు (ఆర్ఎస్ఎస్) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పోస్టేజీ స్టాంపుతో పాటు వంద రూపాయిల నాణేన్ని ప్రధాని మోడీ విడుదల చేయడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) పొలిట్బ్యూరో తీవ్రంగా ఖండించింది. ఆర్ఎస్ఎస్ ఎన్నడూ ఆమోదిం చని భారత రాజ్యాంగానికి ఇది తీవ్రమైన గాయమని, రాజ్యాంగాన్ని అవమానించడమేనని విమర్శించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. మతతత్వ హిందూ రాష్ట్ర భావనకు ప్రతీకగా ఆర్ఎస్ఎస్ ప్రచారం చేసే హిందూ దేవత భారత మాత చిత్రాన్ని ఆ అధికారిక నాణెంపై ముద్రించడం తీవ్ర అభ్యంతరకరమైన అంశమని పొలిట్బ్యూరో పేర్కొంది. 1963లో రిపబ్లిక్ డే పరేడ్లో యూనిఫారం ధరించిన ఆర్ఎస్ఎస్ వలంటీర్లతో విడుదల చేసిన పోస్టేజీ స్టాంపు కూడా చరిత్రను తప్పుగా చూపిస్తోంది. ఇండో-చైనా యుద్ధం సమయంలో దేశభక్తికి గుర్తింపుగా 1963 రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనాల్సిందిగా ఆర్ఎస్ఎస్ ను నెహ్రూ ఆహ్వానించారనే అసత్యం ప్రాతిపదికన ఇదంతా జరిగింది. ఆనాటి రిపబ్లిక్ డే పరేడ్లో లక్ష మందికి పైగా పౌరులు పాల్గొన్నారని సాక్ష్యాధారాల ద్వారా వెల్లడైంది. యూనిఫారం ధరించిన ఆర్ఎస్ఎస్ వలంటీర్లు అక్కడ వున్నారని ఎక్కడా పేర్కొనలేదు.
ఇది యాధృచ్ఛికం కూడా. స్వాతంత్య్ర ఉద్యమానికి కేవలం దూరంగా వుండడమే కాదు, నిజానికి విభజించి పాలించు అన్న బ్రిటిష్ వ్యూహాన్ని బలోపేతం చేయడంలో ఆర్ఎస్ఎస్ సిగ్గుచేటైన పాత్రను తుడిచిపెట్టే ప్రక్రియే ఇదంతా. వలసవాద పాలనకు వ్యతిరేకంగా ఆనాడు సాగించే పోరాటంలో కీలకమైన పాత్ర పోషించిన భారత దేశ ప్రజల ఐక్యతను బలహీనపరిచేందుకే బ్రిటిష్ వారు ఈ విభజించి పాలించు సిద్ధాంతాన్ని అమలు చేశారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత అధ్వాన్నమైన రీతిలో మతోన్మాదం పెచ్చరిల్లి హింస చోటు చేసుకుంది. ఇందులో ఆర్ఎస్ఎస్ పాత్రను అనేక అధికారిక విచారణా కమిషన్లు ఇచ్చిన పలు నివేదికల ద్వారా తెలుసుకోవచ్చు. ఈనాడు మనువాదీ సిద్ధాంతాలను పెంచి పోషించడం ద్వారా సమాజంలోని మైనారిటీ కమ్యూనిటీలను, అలాగే పక్కకు నెట్టేయబడిన వర్గాల ప్రజలను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఆర్ఎస్ఎస్ దాని పరివారం కొనసాగిస్తునే వున్నాయి. ఇది ఆర్ఎస్ఎస్ నిజమైన చరిత్ర, తన అధికారాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా దీన్ని దాచిపెట్టాలని ప్రధాని భావిస్తున్నారు. అలా చేయడం వల్ల తాను నిర్వహించే రాజ్యాంగ పదవి ప్రతిష్టను ప్రధాని దిగజారుస్తున్నారని పొలిట్బ్యూరో విమర్శించింది.