- రైట్-ఆఫ్-వే అప్రూవర్ డిలే లాంటి సమస్యలతో మందగించిన పవర్ ట్రాన్స్ మిషన్
- ట్రాన్స్ మిషన్ నెట్వర్క్ను విస్తరించడంలో ప్రైవేట్ పెట్టుబడి, ప్రజల అవగాహన చాలా కీలకం
నవతెలంగాణ హైదరాబాద్: 2032 నాటికి 600 GW కంటే ఎక్కువ రెన్యూవబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది భారతదేశం. అయితే అది అనుకున్నంత సులభం కాదు. విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి గణనీయమైన ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, మారుమూల ప్రాంతాలకు విద్యుత్తును అందించడానికి ట్రాన్స్మిషన్ లైన్లను విస్తరించడం చాలా కీలకంగా మారింది. ట్రాన్స్మిషన్ టవర్లు, లైన్లు లేకుండా, విద్యుత్ సరఫరా వినియోగదారుల వరకు వెళ్లదు. ప్రభుత్వ వైపు నుంచి మద్దతు ఉన్నప్పటికీ… 2024–25లో 8,830 సర్క్యూట్ కిలోమీటర్ల ట్రాన్స్మిషన్ లైన్లు మాత్రమే ఏర్పడ్డాయి. ఇంకా చెప్పాలంటే.. గత పదేళ్లలో ఇదే అత్యల్పం.
ఎనర్జీ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం ప్రకారం, ట్రాన్స్మిషన్ నెట్వర్క్ వందల కిలోమీటర్ల దూరంలో ఉత్పత్తి చేసిన విద్యుత్తును అధిక వోల్టేజ్తో చివరి వినియోగదారుల వరకు తీసుకువెళ్తుంది. గ్రిడ్ను విస్తరించడంలో అతిపెద్ద అడ్డంకి రైట్-ఆఫ్-వే (RoW). ఇందులో ప్రధాన సమస్య భూసేకరణ. అయితే అవగాహన లేకపోవడం వల్ల స్థానికంగా ప్రతిఘటన రావడం సర్వసాధారణం. చాలా మంది ఇప్పటికీ పరిహారం పాత నిబంధనల ఆధారంగా ఉంటుందని నమ్ముతారు. అయితే, మెరుగైన పరిహారం , భూ యజమానులకు ఎక్కువ పారదర్శకతను నిర్ధారించడానికి మార్చి 2025లో కొత్త మార్గదర్శకాలను విడుదల చేయడంతో జూన్ 2024లో RoW విధానాన్ని సవరించారు. ఇక ఆ తర్వాత ఉన్న సమస్య పర్యావరణ క్లియరెన్స్.
2024 నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్ (ట్రాన్స్ మిషన్) కింద, భారతదేశం తన ట్రాన్స్ మిషన్ నెట్వర్క్ను 6.48 లక్షల సర్క్యూట్ కిలోమీటర్లకు విస్తరించాలని భావిస్తోంది. అంతేకాకుండా సామర్థ్యాన్ని 23.45 లక్షల MVAకి పెంచడం, 2032 నాటికి హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ (HVDC) సామర్థ్యాన్ని 66,750 MWకి పెంచడం లక్ష్యంగా పెట్టుకుందని ఇంధన రంగ విశ్లేషకుడు సద్దాఫ్ ఆలం పేర్కొన్నారు. దీనిని సాధించడానికి వేగవంతమైన పర్మిషన్స్, ప్రజలకు అవగాహన, బలమైన రాష్ట్ర సహకారం అవసరం. దీంతోపాటు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) నమూనాల ద్వారా క్రియాశీల భాగస్వామ్యం కూడా చాలా అవసరం. ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా ఇప్పటికే ఇప్పటికే సాంకేతికత, వేగం, వ్యయ-సామర్థ్యాన్ని మెరుగుపరిచింది. రెన్యూవబుల్ ఎనర్జీ, డిజిటల్ పరిష్కారాలు ప్రాముఖ్యతను సంతరించుకోవడంతో, ప్రైవేట్ రంగం పాత్ర మరింత కీలకం అవుతుంది.
2025 ప్రారంభం నాటికి, భారతదేశంలో 220 kV , అంతకంటే ఎక్కువ విద్యుత్ సరఫరా లైన్లు 4.92 లక్షల సర్క్యూట్ కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి, అయితే ట్రాన్స్ మిషన్ కెపాసిటీ 1,269 GVAకి చేరుకుంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద సమకాలీకరించబడిన విద్యుత్ గ్రిడ్లలో ఒకటిగా నిలిచింది. ఇంటిగ్రేటెడ్ గ్రిడ్ ఇప్పుడు 118,740 MW వరకు విద్యుత్ మార్పిడిని నిర్వహించగలదు. ఫలితంగా, విద్యుత్ కొరత బాగా తగ్గింది: 2014లో 4.2% నుండి 2025లో కేవలం 0.1%కి. భారతదేశం నికర విద్యుత్ ఎగుమతిదారుగా కూడా ఉద్భవించింది.
ట్రాన్స్మిషన్ లైన్లు అనేవి కేవలం పట్టణానికే పరిమితమైన అవసరాలు మాత్రమే కాదు. అవి గ్రామీణాభివృద్ధికి వెన్నెముక. సౌభాగ్య పథకం కింద, బలమైన ట్రాన్స్మిషన్ మౌలిక సదుపాయాల కారణంగా లక్షలాది గృహాలకు విద్యుదీకరణ జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని గ్రామాలకు నమ్మకమైన సరఫరా లభించింది, పాఠశాలల్లో స్మార్ట్ తరగతి గదులు, ఆరోగ్య కేంద్రాల్లో ఆధునిక పరికరాలు, పొలాల్లో నీటిపారుదల పంపులు అందుబాటులోకి వచ్చాయి. విద్యుత్ అనేది.. గ్రామీణ ఆంధ్రప్రదేశ్ జీవితాల్నే మార్చేసింది.