Saturday, October 4, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలి

ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలి

- Advertisement -

2013 చట్టం ప్రకారం పేద రైతులకు న్యాయం చేయాలి
6న హెచ్‌ఎండీఏ ఎదుట నిర్వాసితుల ధర్నా : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) అలైన్‌మెంట్‌ మార్పు, ప్రజల్లో వ్యక్తమవుతున్న అనుమానాలు, ఆరోపణలతో పాటు నిర్వాసితుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలనీ, 2013 చట్టం ప్రకారం పేద రైతులకు న్యాయం చేయాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ నెల 6న సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో హెచ్‌ఎండీఏ కార్యాలయం ఎదుట నిర్వాసితులతో ధర్నా నిర్వహించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రైతులతో మాట్లాడకుండా, గ్రామ సభలు నిర్వహించకుండా, భూమి సేకరణలో స్పష్టతనివ్వకుండా బలవంతంగా భూములను తీసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తే రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. అలాంటి పరిస్థితి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. మొత్తం 8 జిల్లాలు, 33 మండలాలు, 163 గ్రామాల పరిధిలో 100 మీటర్ల వెడల్పుతో ఆ రోడ్డును నిర్మించాలని హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌ను ఇచ్చిందని గుర్తు చేశారు. దీనికోసం భూములు తీసుకుంటామనీ, రైల్వే ట్రాక్‌ కోసం మరో 40 అడుగుల వెడల్పుతో రోడ్డును పెంచుతామని ప్రభుత్వం చెబుతున్నదని తెలిపారు.

ఇంతకు ముందు మొదటి అలైన్‌మెంట్‌ తయారుచేశారనీ, తర్వాత దాన్ని మార్చి రెండోసారి అలైన్‌మెంట్‌ చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు మూడో అలైన్‌మెంట్‌ను తయారుచేసి విడుదల చేశారని చెప్పారు. ఇందులో రాజకీయ అండదండలు, డబ్బు, పలుకుబడి ఉన్న వారి భూముల జోలికి వెళ్లకుండా ఎకరం, రెండు, మూడెకరాలున్న చిన్న, సన్నకారు రైతులకు సంబంధించిన భూములున్న ప్రాంతాన్నే రింగ్‌ రోడ్డుకోసం తీసుకుంటున్నట్టుగా పెద్దఎత్తున ఆరోపణలొస్తున్నాయని గుర్తు చేశారు. 2013 చట్టం ప్రకారం గ్రామ సభల ద్వారా రైతుల ఆమోదం తీసుకోవాలన్నారు. భూమికి భూమి ఇవ్వాలనీ, మార్కెట్‌ రేటుకు మూడింతలు అదనంగా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నిర్వాసితులకు తగిన విధంగా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ‘ఆ భూములను నమ్ముకునే బ్రతుకుతున్నామనీ, మాకు మరో అవకాశం లేదనీ’ రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రింగ్‌రోడ్డు అలైన్‌మెంటును ఎందుకు మార్చుతున్నదో స్పష్టతనివ్వాలనీ, కొద్దిమంది పెద్దల ప్రయోజనాల కోసం సామాన్యమైన చిన్నరైతుల జీవితాలను దెబ్బతీసే వైఖరిని మార్చుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -